పూర్ణిమను కిడ్నాప్ చేసింది ఉపాధ్యాయులేనా?: రంగంలోకి 18బృందాలు
హైదరాబాద్: గత నెలన్నర క్రితం అదృశ్యమైన విద్యార్థిని పూర్ణిమ(15) కేసు మరో కొత్త మలుపు తిరిగింది. పూర్ణిమ అదృశ్యం కాలేదని, ఆమెను ఎవరో దుండగులు కిడ్నాప్ చేశారని సీఐ బాలకృష్ణారెడ్డి తెలిపారు. అందుకే ఈ కేసును కిడ్నాప్ కేసుగా మార్చినట్లు ఆయన తెలిపారు.
టెన్త్ విద్యార్థిని పూర్ణిమసాయి ఎక్కడ, 40 రోజులైనా దొరకని ఆచూకీ
నెలన్నర క్రితం
జూన్ 7వ తేదీని నిజాంపేట్కు చెందిన చొల్లంగి నాగరాజు, విజయకుమారిల కుమార్తె పూర్ణిమ సాయి తమ ఇంటి పక్కనే గల ఓ ప్రైవేటు పాఠశాలకు వెళుతున్నట్లు చెప్పి అదృశ్యమైంది. అదే రోజు సాయంత్రం పూర్ణిమ తల్లిదండ్రులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టారు.
కిడ్నాప్ కేసుగా.. రంగంలోకి 18బృందాలు
రోజులు గడుస్తున్నా పూర్ణిమ ఆచూకీ లభించకపోవడంతో 18 బృందాలను రంగంలోకి దించారు. అయినా చిన్న క్లూ కూడా లభించలేదు. దీంతో గురువారం పూర్ణిమ తల్లిదండ్రులు చొల్లంగి నాగరాజు, విజయకుమారిలు బాలల హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. దీంతో మిస్సింగ్ కేసును పోలీసులు కిడ్నాప్(ఐపీసీ సెక్షన్ 366) కేసుగా మార్చారు. దర్యాప్తును మరో కోణంలో చేపట్టారు.
ఆ ఇద్దరు ఉపాధ్యాయులపైనే..
కాగా, తమ కుమార్తె అదృశ్యానికి సంబంధించి ఆమె చదువుతున్న పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులపై అనుమానాలు ఉన్నాయని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి పూర్ణిమను కనుక్కోవాలని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రేఖ డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరిని వీడాలని అన్నారు. బాలిక అదృశ్యమై నెలన్నర గడుస్తున్నా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులపై బాలల హక్కుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది.
సీసీ కెమెరాలు ముందే అమర్చివుంటే..
నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ సీసీ కెమెరాలు ఉండాలని, పూర్ణిమ చదువుతున్న భాస్యం స్కూల్లో మాత్రం ఎందుకు లేవని అచ్యుతరావు ప్రశ్నించారు. బాలిక అదృశ్యం తర్వాతే పాఠశాల యాజమాన్యం స్పందించి.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిందని అన్నారు. పూర్ణిమ అదృశ్యానికి ముందే సీసీ కెమెరాలు అమర్చి ఉంటే తమ కూతురు ఆచూకీ దొరికి ఉండేదని పూర్ణిమ తల్లిదండ్రులు వాపోయారు.