ఇష్టంలేని పెళ్లి కుదిర్చారు: మనస్తాపంతో కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: మైనర్ బాలికను పెళ్లి చేసుకోమని బంధువులు ఒత్తిడి చేస్తుండటంతో తట్టుకోలేక అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ సురేందర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
మెదక్ జిల్లా సదాశివపేట మండలం తంగేడుపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ శివారెడ్డి (29) గాంధీనగర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో నివసిస్తూ గౌలిగూడలోని ఫైర్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగి కావడంతో గ్రామానికి చెందిన బంధువులు కొందరు మైనర్ని వివాహం చేసుకొమ్మని గత కొంతకాలంగా శివారెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.
అంతేకాదు గత మార్చి నెలలో దూరపు బంధువైన మైనర్ బాలికతో నిశ్చితార్ధం కుదిర్చారు. మైనర్ బాలికను తనకు ఇష్టం లేదని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇష్టం లేని పెళ్లి కుదిర్చారని అప్పటి నుండీ తీవ్ర మనస్తాపానికి గురై నాలుగు రోజులుగా డ్యూటీకి కూడా వెళ్లటం లేదు.
అంతేకాదు బాలికను పెళ్లి చేసుకొమ్మని బంధువులు స్టేషన్ ఫైర్ఆఫీసర్ రాజ్కుమార్ ద్వారా కూడా ఒత్తిడి చేయించారు. శివారెడ్డి నిరాకరించడంతో ఫైర్ ఆఫీసర్ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శివారెడ్డి గురువారం రాత్రి రూమ్మేట్ బాలకృష్ణ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన బాలకృష్ణ ఎంత తలుపు కొట్టినా తీయకపోవటంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా విగతజీవుడై కన్పించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు శివారెడ్డి రూమ్లో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు.
అందులో ''నా మరణానికి నాగిరెడ్డి, మంజులతో పాటు బంధువులు 75 శాతం కారణం కాగా... ఆర్ఎంపీ హనుమంత్రెడ్డి పది శాతం, ఎస్ఎఫ్ఓ రాజ్కుమార్ 15 శాతం కారణం' అని శివారెడ్డి పేర్కొన్నాడు. ఈ మేరకుకేసు నమోదు చేసిున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.