పదేళ్ల తర్వాత పీవీకి దక్కిన గౌరవం: ఢిల్లీలో పీవీ ఘాట్ సిద్ధం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని, తెలుగు ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు మృతిచెంది పదేళ్లు గడిచిన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆయనకు సముచిత గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జన్మించిన పీవీ నర్సింహారావు.. భారత ప్రధానిగా అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే.
సొంత పార్టీ కాంగ్రెస్ తోపాటు, ఆ పార్టీ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిరాదరణకు గురైన నరసింహరావు, దేశ రాజధానిలో ఎట్టకేలకు ‘ఘాట్' రూపంలో తగిన గౌరవాన్ని పొందారు.
దివంగత మాజీ రాష్టప్రతులు, ప్రధాన మంత్రుల స్మారకాలకు సమీపాన ‘రాష్ట్రీయ స్మృతి' వద్ద నరసింహరావు స్మారక ఘాట్ సిద్ధమైందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు రోజుల క్రితం జరిగిన పీవీ జయంతితోపాటే ఈ ఘాట్ సిద్ధమైంది. కేంద్రంలో 1991నుంచి 1996వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన పీవీ నరసింహరావును, ఆ తర్వాత ఆ పార్టీ తీవ్ర నిరాదరణకు గురిచేసింది.
2004లో పీవీ తుదిశ్వాస విడిచిన తర్వాత ఢిల్లీలో ఆయనకు స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిరాకరించిన విషయం విదితమే. అయితే వాస్తవానికి 2013లో యూపీఏ ప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి ఢిల్లీలో ప్రత్యేకంగా మరే నాయకుడి పేరుతో స్మారకాలను ఏర్పాటు చేయరాదని నిర్ణయించింది.
రాజధానిలో స్థలాభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే భారత జాతికి పీవీ అందించిన విశిష్ట సేవలను చలువరాతి శిలాఫలకంపై సంక్షిప్తంగా వివరిస్తూ స్మారకాన్ని ఏర్పాటు చేశారు.