'కాపు' చిచ్చు.. టిడిపితో నాకేం సంబంధంలేదు: బాబుకు ధీటుగా కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖఅయలు చేశారు. తనకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లతో ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో కాపు గర్జన, ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష, ఏపీ ప్రభుత్వం హామీ నేపథ్యంలో.. బిసిలకు కాపులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది.
కాపులకు వేరుగా రిజర్వేషన్లు ఇస్తే పరవాలేదని, అయితే వారిని బీసీల్లో చేరిస్తే మాత్రం సహించేది లేదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం చేయకుండా కాపులను బీసీల్లో చేర్చుతామని, ఆర్ కృష్ణయ్య అర్థం చేసుకోవాలన్నారు. నిన్న మాట్లాడుతూ.. కులాలతో ఓట్లు రావని, ఆర్ కృష్ణయ్య వల్లే ఎల్బీ నగర్లో తాము తక్కువ ఓట్లతో గెలుపొందామని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య తాజాగా పై సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. టిడిపితో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఎన్నికల సందర్భంగా బీసీనీ సీఎంను చేస్తానంటేనే ఆ పార్టీలో చేరానని, టిడిపి ఎమ్మెల్యేగా కంటే బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తాను ఏ ఒక్క పార్టీ జెండాను మోసేందుకు సిద్ధంగా లేనన్నారు.
కాగా, జిహెచ్ఎంసి ఎన్నికలకు ముందు కూడా ఆర్ కృష్ణయ్య టిడిపితో దూరం పాటించారు. ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలలో చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇప్పుడు తనకు టిడిపితో సంబంధం లేదని చెప్పడం గమనార్హం.