చెత్తకుండీలో రూ.16లక్షలు: అన్నీ రద్దయిన నోట్లే.. చెత్త కోసం వెళ్తే ఇలా?
నేరెడ్ మెట్ ఠాణా పరిధిలోని ఓ చెత్త కుండీలో రూ.16లక్షల రద్దయిన నోట్లు వెలుగుచూశాయి.
హైదరాబాద్: గతేడాది నోట్ల రద్దు తర్వాత చాలా చోట్ల చెత్త కుప్పల్లో రద్దయిన పెద్ద నోట్లు దర్శనమిచ్చాయి. నోట్ల రద్దు జరిగి ఇప్పటికీ 8నెలలు అవుతున్నా.. అడపా దడపా పాత కరెన్సీ నోట్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నేరెడ్ మెట్ ఠాణా పరిధిలోని ఓ చెత్త కుండీలో రూ.16లక్షల రద్దయిన నోట్లు వెలుగుచూశాయి.
చిత్తు కాగితాలు సేకరించి జీవనం సాగించే వాజ్ పేయినగర్ వాసి చందా గంగూబాయి(58)కి ఈ నోట్ల కట్టలు కనిపించాయి. గురువారం ఉదయం స్థానిక రైల్వే గేట్ వద్ద ఉన్న చెత్త కుండీలో కాగితాలు సేకరిస్తుండగా.. ఆమెకు పాత రూ.500, రూ.1000నోట్లు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది.
చెత్త కుండీని పరిశీలించిన అధికారులు.. మొత్తం రూ.16లక్షల పాత నోట్లు అందులో ఉన్నట్లు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేశామని, నోట్లు ఎవరు పడేశారన్నది తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
రూ.1.2కోట్ల పాత నోట్ల మార్పిడికి యత్నం:
మంచిర్యాల జిల్లాకు చెందిన సలీమ్ అనే వ్యక్తి రూ.1.2కోట్ల పాత నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ లింబారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన సలీమ్ హైదరాబాద్ మెహిదీపట్నంలో కరాటే కోచ్ గా పనిచేస్తున్నాడు.
మంచిర్యాలలో ఇతని బంధువులు, స్నేహితులు చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వారంతా భారీ మొత్తంలో సలీంకు పాత నోట్లు ఇచ్చి, వాటిని మార్చి ఇవ్వాలని కోరారు. ఇందుకు గాను కమిషన్ పద్దతిలో నోట్లను మార్చేందుకు సలీం ఒప్పుకున్నాడు.
ఒప్పందం మేరకు రూ.1.2కోట్ల విలువైన పాత నోట్లను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నాడు. కూకట్ పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఎల్.సుబ్బారెడ్డిని, విజయనగర్ కాలనీకి చెందిన టెంట్ హౌజ్ వ్యాపారి ఎండీ అలీమ్ లను సహాయం చేయాల్సిందిగా కోరాడు. దీనికి వారు అంగీకరించడంతో.. ముగ్గురు కలిసి కారులో నగదు తీసుకుని పంజాగుట్టకు వచ్చారు.
అప్పటికే దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం వీరి వాహానాన్ని అడ్డగించి.. డబ్బును స్వాధీనం చేసుకుంది. ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.