ఎంసెట్ లీకేజీ వెనుక : అప్పుడూ.. ఇప్పుడూ 'ఒక్కడే'..
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఎంసెట్ లీకేజీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఎంసెట్ లీకేజీ వెనుక ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉషా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రాజగోపాల్ రెడ్డి.. గత 2014 మెడికల్ పీజీ ఎంట్రన్స్ లీకేజీ కేసులోను ప్రధాన నిందితుడు కావడం గమనార్హం. తాజా సీఐడీ విచారణలో వెలుగు చూసిన వాస్తవాలివి.
మేనేజ్ మెంట్ కోటాలో వైద్య సీట్లను విక్రయించే రాజగోపాల్ రెడ్డి.. లీకేజీ దందాలతో కోట్లు గడిస్తున్నాడు. తాజాగా మరో ముగ్గురితో కలిసి ఎంసెట్ లీకేజీ వ్యవహారానికి తెరలేపాడు. ఆ ముగ్గురు నిందితుల్లో విష్ణు అనే వ్యక్తి కన్సల్టెన్సీ నిర్వహిస్తుండగా.. రమేష్ అనే వ్యక్తిగా దళారీగా ఉన్నాడు. తిరుమల్ రెడ్డి అనే మరో వ్యక్తి ఈ లీకేజీ వ్యవహరానికి సహకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నలుగురే కాకుండా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇక నిందితుల్లో ఒకరైన విష్ణు.. తన కన్సల్టెన్సీ ద్వారా వైద్య సీట్లు ఇప్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు జరిపేవాడని తెలుస్తోంది. వేరే రాష్ట్రాల మెడికల్ కాలేజీలతో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకునేవాడన్న ఆరోపణలు విష్ణు మీద ఉన్నాయి.
పక్కా వ్యూహాంతో వ్యవహరించిన సీఐడీ..
ఎంసెట్ లీకేజీ వ్యవహారం సీఐడీ దృష్టికి వెళ్లగానే, అప్రమత్తమైన సీఐఢీ అధికారులు.. ముందుగా బ్రోకర్ల కాల్ డేటాను సేకరించారు. ఆ కాల్ డేటాతో లీకేజీ ద్వారా ర్యాంకులు పొందిన తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను పరిశీలించారు. రెండూ మ్యాచ్ కావడంతో ఎంసెట్ లీకేజీ జరిగిందని ధృవీకరించుకున్నారు సీఐడీ అధికారులు.
ర్యాంకులు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు, బ్రోకర్లకు మధ్య.. మెడికల్ సీట్లకు సంబంధించి కొన్ని వందల సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లుగా గుర్తించారు సీఐడీ అధికారులు. కాగా, ఇందులో ఇద్దరు జేఎన్టీయూ సిబ్బంధి పేర్లు కూడా ఉండడం గమనార్హం. ఇద్దరిలో ఒకరు ప్రొఫెసర్ కాగా, మరొకరు నాన్ టీచింగ్ స్టాఫ్ గా సమాచారం.
మొత్తం వ్యవహారం ద్వారా నిందితులంతా రూ.50 కోట్ల కుంభకోణానికి పాల్పడగా.. తద్వారా 74మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. ప్రస్తుతం కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీఐడీ అధికారులు సీఎం కేసీఆర్ కు అందజేశారు.
అసలు లీకేజీ ఎలా జరిగింది..
ఈ మొత్తం ఎంసెట్ లీకేజీ వ్యవహారమంతా బెంగుళూరు నుంచే జరిగింది. బెంగుళూరులోనే ఉషా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహించే రాజగోపాల్ రెడ్డి.. అక్కడి నుంచే ప్లాన్ అంతా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఎంసెట్ పేపర్ల ప్రింటింగ్ ఢిల్లీలో జరుగుతుందన్న విషయం తెలుసుకున్న రాజగోపాల్ రెడ్డి.. ఎంసెట్ కు పరీక్షకు సంబంధించిన మూడు సెట్లను అక్కడి నుంచే లీక్ చేయించాడు.
అంతకుముందే హైదరాబాద్ లో ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థుల వివరాలను సేకరించి విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. సాధారణంగా ఎంసెట్ లో ఏ సెట్ ను పరీక్షకు ఇచ్చేది పరీక్ష జరిగే రోజు ఉదయమే నిర్వహిస్తారు.. అయితే రాజగోపాల్ రెడ్డి తెలివిగా మూడు సెట్లను లీక్ చేయించడంతో విద్యార్థులకు ర్యాంకులు సాధించడం సులువైపోయింది.
పేపర్లను లీక్ చేసిన తర్వాత ఒప్పందాలు కుదుర్చుకున్న ఆయా విద్యార్థులను బెంగుళూరుకు రప్పించి అక్కడే రెండు రోజుల పాటు మూడు ఎంసెట్ సెట్లను ప్రాక్టీస్ చేయించారు. సరిగ్గా పరీక్ష రోజు ఉదయమే వాళ్లందరినీ బెంగుళూరు నుంచి విమానాల ద్వారా హైదరాబాద్ కు తీసుకొచ్చి ప్లాన్ ప్రకారం పని కానిచ్చేశారు.