సీఎం ఇవ్వమన్నందుకే! కేసీఆర్ కుట్రలు : రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితులకు ఒక నీతి, దొరలకు మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు.
కడియం శ్రీహరికి చెక్ పెట్టేందుకు రాజయ్యను డిప్యూటీ సీఎం చేశారని, ఇప్పుడు రాజయ్యకు చెక్ పెట్టేందుకు కడియంను తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. ఏ తప్పు చేయని రాజయ్యపై చర్యలకు పూనుకున్న కేసీఆర్ రామేశ్వర రావు, ప్రవీణ్ రావుల అవినీతిపరులపై ఎందుకు చర్యలు తీసుకోరన్నారు.
కేసీఆర్ విదేశాలకు వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోందని, బాధ్యతలు అప్పగించాలని కోరినందుకే రాజయ్యపై వేటు వేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను ఎదురుకునేందుకు దళితులు కావాలని, కానీ పదవులకు మాత్రం దళితులు అవసరం లేదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రాజకీయ చదరంగంలో దళితులు పావులుగా మారారన్నారు. స్వైన్ ఫ్లూపై వైద్య ఆరోగ్య శాఖకు ఎంత బాధ్యత ఉందో, మున్సిపల్ శాఖకు అంతే బాధ్యత ఉంటుందన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దనే ఉందని, దీనిపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఘాటుగా మండిపడ్డారు.
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులు...
మంత్రివర్గంలోను మార్పులు చేర్పులు జరిగాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని కడియం నిర్వహిస్తారు. అలాగే విద్యాశాఖను అప్పగించారు. ఇన్నాళ్లుగా విద్యాశాఖ నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డికి విద్యుత్ శాఖను అప్పగించారు. రాజయ్య వద్ద ఉన్న వైద్య ఆరోగ్య శాఖను లక్ష్మారెడ్డికి ఇచ్చారు.