టీఆర్ఎస్లో చేరిన రాథోడ్, పైడిపల్లి, 8 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం కూడా
ఊహించినట్లుగానే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్రావు సోమవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాథోడ్, పైడిపల్లితో పాటు పలువురు టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా టీఆర్ఎస్లో చేరారు. రమేశ్ రాథోడ్ వెంట తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేశ్ రాథోడ్, టీటీడీపీ జిల్లా కన్వీనర్ యూనిస్ అక్బానీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్కలాం, ఉమ్మడి జిల్లా గిరిజనేతరుల సంఘం అధ్యక్షుడు నాందేవ్, ఉపాధ్యక్షుడు బుట్టోతో పాటు 30 మండలాలకు చెందిన మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, పది మంది పీఏసీఎస్ చైర్మన్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు టీఆర్ఎస్ లో చేరారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పైడిపల్లి రవీందర్రావు వెంట ఖానాపూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మణ్రావు, ఎస్టీ సెల్ నాయకుడు భరత్ చౌహన్తో పాటు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఇక్కడి ముఖ్య నాయకులంతా టీఆర్ఎస్లో చేరారు.
వీరంతా ఇప్పటికే తమ తమ పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచి పట్టున్న ఇద్దరు కీలక నేతలు ఒకే రోజు గులాబీగూటికి రావడంతో ఆయా ప్రాంతాల్లో టీటీడీపీ, కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లయింది.
8 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఛైర్మన్లను నియమించారు. ఈ మేరకు వారి పేర్ల జాబితాను ప్రకటించారు. వీటితో పాటు పార్టీకి సంబంధించిన పలు విభాగాలకు అధ్యక్షుల పేర్లను కూడా ఖరారు చేశారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే), ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపీ గుండు సుధారాణి (వరంగల్ జిల్లా), తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూమ్ రెడ్డి (మెదక్ జిల్లా)ని నియమించారు.
ఇక తెలంగాణ రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా)ను, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్ మెంట్ చైర్మన్ గా పుష్కర్ రామ్మోహన్ రావు (ఆదిలాబాద్-మందమర్రి)ను నియమించారు.
అలాగే తెలంగాణ రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కే వాసుదేవ రెడ్డి (కేయూ విద్యార్థి నాయకుడు)ని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్)ను, తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయు విద్యార్థి నాయకుడు-పెద్దపల్లి)ను సీఎం నియమించారు.
మహిళా విభాగం అధ్యక్షురాలిగా...
వీటితో పాటు పార్టీకి సంబంధించిన పలు విభాగాలకు అధ్యక్షుల పేర్లను ఖరారుచేశారు. టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా), తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (కరీంనగర్ జిల్లా) ను నియమించారు.