ఎంపీ కొత్తపల్లి గీతకు ఊరట, పీఎన్బీ పిటిషన్ కొట్టివేత: జైలు శిక్షపై భర్తకు షాక్
బకాయిలు చెల్లించలేదన్న కేసులో ఎంపీ కొత్తపల్లి గీతకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్త రామకోటేశ్వర రావుకు మాత్రం చుక్కెదురయింది.
హైదరాబాద్: బకాయిలు చెల్లించలేదన్న కేసులో ఎంపీ కొత్తపల్లి గీతకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్త రామకోటేశ్వర రావుకు మాత్రం చుక్కెదురయింది. గతంలో ఆయనకు ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధించింది.
దీనిని నాంపల్లి కోర్టు సమర్థించింది. మరోవైపు, ఈ కేసులో ఎంపీ కొత్తపల్లి గీతకు కూడా శిక్ష విధించాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. దీనిని నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తనకు శిక్ష విధించాలన్న ఎర్రమంజిల్ కోర్టు తీర్పు పైన రామకోటేశ్వర రావు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
కాగా, బకాయిలు చెల్లించలేదన్న కేసులో ఎంపీ కొత్తపల్లి గీత భర్త పీఆర్కే రావుకు గత ఏడాది డిసెంబరు నెలలో అరెస్ట్ వారెంటు జారీ అయింది.
హైదరాబాదులోని బంజారాహిల్స్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 2008 డిసెంబర్లో రూ. 25 కోట్లు లోన్ తీసుకున్నారు. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఆయన ఎండీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోన్కు సంబంధించి ఆయన ఇచ్చిన రూ. 25 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ అయింది. దీంతో ఆయన బ్యాంకు పోలీసులను ఫిర్యాదు చేసింది.
కొత్తపల్లి గీతకు షాక్: రూ.25 కోట్ల లోన్, భర్తకు అరెస్ట్ వారెంట్
ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్, లోన్కు పూచీకత్తు వహించిన గీతపై కూడా బ్యాంకు క్రిమినల్ కేసు పెట్టింది.
దీంతో పీఆర్కే రావును దోషిగా ఎర్రమంజిల్ స్పెషల్ జుడీషియల్ కోర్టు తేల్చింది. ఆయన బ్యాంక్ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించింది. అలాగే రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించారు. అయితే ఈ కేసులో ఎంపీని నిర్దోషిగా కోర్టు తేల్చింది. దీనిపై రామకోటేశ్వర రావు నాంపల్లి కోర్టుకు వెళ్లగా ఆయనకు చుక్కెదురయింది.