ఏసీబీ ఎప్పుడు పిల్చినా: రేవంత్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట, కానీ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో బుధవారం నాడు ఊరట లభించింది. బెయిల్ షరతులు సడలించాలని అతను వేసిన పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణలో రేవంత్కు కొంత ఊరట లభించింది. అంతేకాదు, ప్రతివారం ఏసీబీ ఎదుట హాజరు కావాలన్న షరతును కూడా సడలిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ తీర్పు పైన ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీబీ దర్యాఫ్తు పెండింగులో ఉందని హైకోర్టుకు తెలిపింది. దీంతో, ఏసీబీ ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని రేవంత్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
కాగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గత ఏడాది అరెస్టై బెయిల్ పైన విడుదలైన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలోను సంచలనం రేపింది. దీనిపై ఏపీ ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలుమార్లు నిలదీసింది.
హైదరాబాద్ రోడ్ల స్కాంపై సిబిఐ విచారణకు డిమాండ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన వంద కోట్ల స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో రోడ్ల స్కాంపై విచారణ జరిపించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ జరిగింది.
హిమాయత్నగర్ నుంచి ర్యాలీగా బయల్దేరిన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్బంగా ర్యాలీలో పాల్గొన్న చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. ఎస్ఈ స్థాయి అధికారితో విచారణ జరపటం వల్ల నిజాలు బయటకు రావని, స్కాంలో ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామన్న ప్రభుత్వం నరకనగరంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు.