నేను రెడీ, మనిద్దరి పైనా విచారణ!: కేసీఆర్కు రేవంత్
హైదరాబాద్: డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ధీటుగా స్పందిస్తున్నారు. తాను ఎలాంటి విచారణలకైనా సిద్ధమని ప్రకటిస్తున్నారు. భూముల వ్యవహారంలో గురువారం కేసీఆర్ శాసన సభలో వివరణ ఇవ్వడంతో పాటు పరోక్షంగా రేవంత్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే.
దీని పైన రేవంత్ శుక్రవారం ఉదయం ఓ చానల్తో మాట్లాడుతూ ధీటుగా స్పందించారు. తన రాజకీయ జీవితం పైన ఎలాంటి విచారణకైనా సిద్ధమని, అలాగే కేసీఆర్ రాజకీయ జీవితం పైన కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎవరు బ్లాక్ మెయిల్ చేశారో తెలుస్తుందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.
సీబీఐ విచారణకు సిద్ధమేనా?
కేసీఆర్ ప్రభుత్వం మైహోంకు భూ అక్రమ కేటాయింపులపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని, కేసీఆర్కు దమ్ముంటే సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం సవాల్ విసిరింది. టీడీపీ అధికార ప్రతినిధులు సీతక్క, నన్నూరి నర్సిరెడ్డి, సీనియర్ నేతలు ఎల్ రమణ, మోత్కుపల్లి నర్సింహులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ పాలన కొనసాగిస్తోందన్నారు. తన పరిపాలనలో ఉన్న డొల్లతనాన్ని, అవినీతి అక్రమాలను బయటపడకుండా ఉండేందుకు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారన్నారు. మేధావుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమా ప్రశ్నించారు.
ఏ ఒక్క టీడీపీ నేతను, ప్రతిపక్ష సభ్యులను మాట్లాడకుండా చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అసెంబ్లీలో మామా, అల్లుడు, కొడుకు తప్ప మిగతా మంత్రులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ కుటుంబం అన్ని రకాలుగా పదవులు అనుభవించడమేనా అని ప్రశ్నించారు.