రేవంత్ హైజాక్: 76 లోకసభ స్థానాలపై బాబు కన్ను
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాలమూరు పర్యటనను ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హైజాక్ చేశారు! గురువారం నాడు చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి కేంద్రంగా నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నిప్పులు చెరగడంలోను రేవంత్ రెడ్డి సీనియర్ టీడీపీ నేతలు, ఎర్రబెల్లి, మోత్కుపల్లిలను మించి పోయారని చెప్పవచ్చు. పాలమూరు సభలో రేవంత్ ఓ స్థాయిలో కేసీఆర్ను ఏకిపారేశారు.
అసెంబ్లీలో ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే కళ్లలోకి చూడలేని దౌర్భాగ్య సీఎం కేసీఆర్ ఉన్నారని విమర్శించారు. ఇలాంటి సీఎం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానంటే ఎలా నమ్ముతారన్నారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేస్తామని కేసీఆర్ అంటున్నారని, ఖాళీ చేయడానికి టీడీపీ మందు సీసా కాదని ఎద్దేవా చేశారు.
ఇంతకు ముందు ఇలాగే ప్రగల్బాలు పలికిన వైయస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో పావురమై పోయారని, టీడీపీని కేసీఆర్ తాత, ముత్తాతలు దిగివచ్చినా కదిలించలేరన్నారు.
మరోవైపు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలలో ఎన్నికల్లో పోటీ చేస్తామని చంద్రబాబు చెప్పడం గమనార్హం. 76 పార్లమెంటు స్థానాలు తమ టార్గెట్ అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 60 నుంచి 70 వరకూ పార్లమెంట్ సీట్లకు పోటీ చేసే ఆలోచన ఉందని తెలిపారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో 42 లోకసభ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు సూరత్, ఢిల్లీ ఎన్నికలలో పోటీ చేయాలని యోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.