పోలీసుల కళ్లుగప్పి, రేవంత్ రెడ్డి వ్యూహం, ఎట్టకేలకు అరెస్ట్
మెదక్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సోమవారం నాడు పోలీసులు గజ్వెల్లో అరెస్టు చేశారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం మల్లన్న సాగర్ నిర్వాసితుల పైన పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని నిరసిస్తూ అఖిల పక్షం నేడు జిల్లా బందుకు పిలుపునిచ్చింది. బందులో పాల్గొన్న మల్లన్న సాగర్ నిర్వాసితులను పరామర్శించేందుకు పదిమంది టిడిపి నేతలతో కలిసి ఆయన బయలుదేరారు.
టీలో పోలీసుల లాఠీచార్జ్, రాళ్లతో తరిమేశారు (పిక్చర్స్)
తుర్కపల్లి వద్దే అన్ని పక్షాలు, ప్రజా సంఘాలకు చెందిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి పోలీసుల కన్నుగప్పి కాన్వాయ్ నుంచి దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి, అనంతరం కారులో గజ్వెల్ చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రేవంత్ రెడ్డి, ఇతర నేతలను అరెస్టు చేసి, గజ్వెల్ పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్టైన వారిలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింగ కూడా ఉన్నారు. రేవంత్, దామోదర అరెస్ట్ సమయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. మరోవైపు, మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న జేఏసీ చైర్మన్ కోదండరాంను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి
మల్లన్నసాగర్ నిర్వాసితులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు పట్ల తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులపై పాశవికంగా వ్యవహరిస్తోందన్నారు. మెదక్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి
మల్లన్నసాగర్ ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న రైతుల ఉద్యమానికి తెలంగాణలో అన్ని వర్గాల వారి నుంచి మద్దతు లభించిందన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. నిర్వాసితులకు జీవో 123 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామనడం అన్యాయమన్నారు.
రేవంత్ రెడ్డి
గ్రామాల్లో భూములన్న రైతులే కాదు రైతు కూలీలు కూడా ఉన్నారని ప్రభుత్వం వారికి అన్యాయం చేయొద్దన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులని నమ్ముకొనే పాలన చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు ఉపయోగించిన భాషను హరీశ్ రావు ఉపయోగిస్తున్నారన్నారు.
రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్ సమీపంలో నిర్మిస్తోన్న పాములపర్తి రిజర్వాయర్ను 21 నుంచి 7 టీఎంసీలకు తగ్గించింనప్పుడు మల్లన్న సాగర్ ముంపును ఎందుకు తగ్గించడం లేదని రేవంత్ అడిగారు. రైతుల ఇష్టంతోనే వారి భూములు తీసుకోవాలని లేదంటే తాము వచ్చేనెల 13, 14న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర దీక్షకు దిగుతామని హెచ్చరించారు.