కేసీఆర్కి భయం, సవాల్ చేస్తున్నా: తలసానిపై రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు. సత్సంప్రదాయాలకు తెరలేపానని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతుంటారని, ఆయనకు నిజంగానే ధైర్యం ఉంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదింపచేసి, ఉప ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.
తమ పార్టీకి చెందిన నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు అడ్డమైన కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే దూషించడం కాదని, సమాధానం చెప్పాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను ఆమోదించాలన్నారు. తలసాని నిజంగానే రాజీనామాతో సత్సంప్రదాయానికి తెరలేపారనుకుంటే, ఆయన రాజీనామా చేశారని, తాము ఫిర్యాదు చేశామని, ఇప్పుడు ఆయన రాజీనామాను ఆమోదించేందుకు సభాపతికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.
సభాపతి పైన ప్రభుత్వం ఒత్తిడి ఉందా చెప్పాలన్నారు. తలసాని రాజీనామా ఆమోదిస్తే టీడీపీ బలమా, తెరాస బలమా లేదా ఇతర పార్టీ బలమా తెలుస్తుందన్నారు. సత్సంప్రదాయాలకు తెరలేపానని చెబుతున్న కేసీఆర్ చెప్పే నీతి నేతి బీరకాయలోని నేతి అంత అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందన్నారు. అధికారం పైన మోజు పెరిగిందని, అధికారం పైన మోజుతో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తున్నారన్నారు. ప్రజలు కేసీఆర్ను నమ్ముతున్నారనుకుంటే వెంటనే తలసాని రాజీనామాను ఆమోదింప చేసి, ఎన్నికలకు రావాలని సవాల్ చేసారు.