అలా పైచేయి: కేసీఆర్ను ఇరుకున పడేసిన రేవంత్, తమ్ముళ్ల ఆనందం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు. మల్లన్న సాగర్, వర్షాలకు దెబ్బతిన్న హైదరాబాద్ రోడ్ల పైన ఆందోళనలు.. దానికి తోడు నాలుగు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీని తెరాసలో విలీనం పైన హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో ఆనందం వెల్లువిరుస్తోందని అంటున్నారు.
ముగ్గురే మిగలడంతో
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో 15మంది గెలిచారు. అందులో 12 మంది తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో టిడిపిని తెరాసలో విలీనం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. తొలుత పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చిన తర్వాతనే విలీనం ఊసెత్తాలని కోర్టు అభిప్రాయపడింది.
టిడిపి సంబరాలు
ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు సంబరాలు కూడా చేసుకున్నారు. రేవంత్ రెడ్డి తదితర నేతలు మూడు రోజుల క్రితం స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు కేసీఆర్కు, తెరాసకు గట్టి షాక్ అని వ్యాఖ్యానించారు.
తమ్ముళ్ల ఆనందం
మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరుకున పడేశారని తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్టీ విలీనం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కేసీఆర్ పైన రేవంత్ నైతికంగా నెగ్గడంతో పాటు కోర్టులోను విజయం సాధించారని ఆనందిస్తున్నారు.
చేరికలు
ఓ విధంగా ఇది కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి లేదా తెలుగుదేశం పార్టీది పైచేయి అంటున్నారు. కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన ఎమ్మెల్యేల పైన నిర్ణయాన్ని ఎన్ని రోజులు పొడిగిస్తే.. అన్ని రోజుల దాకా విలీనం అంశం కూడా ముగిసినట్లేనని అంటున్నారు. ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టినప్పటికీ.. చట్టసభలో విలీన అంశానికి రేవంత్ కొత్త ట్విస్ట్ ఇచ్చి కేసీఆర్ పైన పైచేయి సాధించారని అంటున్నారు.