టిఆర్ఎస్ ప్రశ్నలు - రేవంత్ రెడ్డి 'షాకింగ్' సమాధానాలు!
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైందనే చెప్పవచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మిగిలింది ముగ్గురే. మిగతా 12 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ టిడిపిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కీలక నేతగా రేవంత్ రెడ్డి ఉన్నారు.
ప్రస్తుతం ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ టిడిపి రాజకీయాలు ఇప్పుడు ఆయన చుట్టూనే తిరుగుతున్నాయనే వాదనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పాలేరు ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడంపై అధికార తెరాస ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
దానికి రేవంత్ రెడ్డి ధీటుగానే సమాధానం చెబుతున్నారు. గతంలో నారాయణఖేడ్ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మానవతా విలువలు, రాజకీయ విలువలు అంటూ పాలేరు ఉప ఎన్నికల సమయంలో మాట్లాడుతోందని, గెలిచే సత్తాలేక పోటీ నుంచి తప్పుకుందని తెరాస చెబుతోంది.
మంత్రులు హరీష్ రావు, కెటి రామారావు, తుమ్మల నాగేశ్వర రావులతో పాటు పలువురు నేతలు కూడా టిడిపి ఎలాగూ గెలవదని తెలిసే పోటీ నుంచి తప్పుకుందని చెబుతున్నారు. పాలేరు ఉప ఎన్నికల్లో తెరాసనే గెలుస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు.
పాలేరులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తోంది. అయితే, గతంలో నారాయణఖేడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు టిడిపి ఉప ఎన్నికల బరిలో నిలిచింది. పాలేరులో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది.
దీనినే అధికార తెరాస ప్రశ్నిస్తోంది. తెలంగాణలో టిడిపికి నూకలు చెల్లాయని, అది తెలిసే పాలేరు ఉప ఎన్నిక నుంచి తప్పుకుందని చెబుతున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ధీటైన సమాధానం చెబుతున్నారు.
గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తమను కాంగ్రెస్ పార్టీ సంప్రదించలేదని, అందుకే పోటీ చేయాల్సి వచ్చిందని, కానీ పాలేరు ఉప ఎన్నిక విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించిందని, అందుకే తప్పుకున్నామని చెబుతున్నారని తెలుస్తోంది.
తెరాస మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డికి కనీసం అపాయింటుమెంట్ కూడా ఇవ్వడం లేదని ఎదురు దాడికి దిగుతున్నారు.
అదే సమయంలో, గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారిని పార్టీలో చేర్చుకొని మంత్రులుగా చేస్తున్న కెసిఆర్కు.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను కూడా అలాగే ఎమ్మెల్సీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారట.