హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని భారత హాకీ ఫెడరేషన్(ఐహెచ్ఎఫ్) జాతీయ అధ్యక్ష పదవి వరించింది. భారత్ హాకీ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) జాతీయ అధ్యక్షుడిగా రేవంత్ ఎన్నికయ్యారని ఐహెచ్ఎఫ్ సెక్రటరీ జనరల్ అశోక్ మాథుర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారత హాకీ సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హాకీ క్రీడకు తన వంతు ప్రోత్సాహం ఇస్తానని అన్నారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని వెల్లడించారు. తెలంగాణకు క్రీడల్లో గుర్తింపు తీసుకొస్తానని చెప్పారు.
క్రీడల పట్ల ఎంతో ఆసక్తి కనబరిచే రేవంత్ రెడ్డికి.. హాకీ, కబడ్డీ, ఖో-ఖో, ఫుట్బాల్ క్రీడలను అమితంగా ఇష్టపడతారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఐహెచ్ఎఫ్కు ఇంతకుముందు పంజాబ్ మాజీ డీజీపీ కెపిఎస్ గిల్, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ దినేష్రెడ్డిలు అధ్యక్షులుగా పనిచేశారు.
ఆ తర్వాత, కెవి సింగ్ అనే వ్యాపారవేత్త, ఐహెచ్ఎఫ్ అధ్యక్షునిగా ఉండగా, రేవంత్, ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే, కె.వి.సింగ్ పని తీరుపట్ల ఐహెచ్ఎఫ్ కార్యవర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. హాకీ అభివృద్ధిలో ఆయన విఫలమయ్యారని భావించింది.
గురువారం, జాతీయ కార్యవర్గం సమావేశమై, అందరి ఆమోదంతో కెవి సింగ్ను తప్పించామని మాథుర్ తెలిపారు. రేవంత్ ఆధ్వర్యంలో హాకీ సమాఖ్య మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు మాథుర్ తెలిపారు.