ద్రోహులకు మంత్రి పదవులు, పోరాటం చేసిన కోదండరామ్ ఒంటరి: రేవంత్
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతు అత్మహత్యలను నివారించాలని కోరుతూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్లో బీజేపీ-టీడీపీ నేతలు బుధవారం పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు నిరోధించేందుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేసీఆర్ను నిలదీసే శక్తి వరంగల్ ప్రజలకు ఉందన్నారు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీని పాతిపెట్టాలని, చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పోలీసులకు వాహనాలు ఇచ్చి ఈ ప్రభుత్వం తమను కొట్టిస్తోందని, టీఆర్ఎస్ నేతలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఏనాడు పోరాటం చేయని వారికి కేసీఆర్ మంత్రి పదవులిచ్చారని, అదే తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరామ్ను మాత్రం ఒంటరిని చేశాడన్నారు.
తెలంగాణ ఉద్యమకారులపై ఒకప్పుడు రాళ్లు విసిరిన కొండా సురేఖ ఇప్పుడు సీఎం కేసీఆర్కు ఆప్తులయ్యారని విమర్శించారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ పాదయాత్రలో పెద్దఎత్తున టీడీపీ, బీజేపీ శ్రేణులు, నేతలు హాజరయ్యారు. రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 10వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. అలాగే రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.