వర్షాలు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారాయా?: ప్రభుత్వ చర్యలపై నిప్పులు చెరిగారు
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నుంచి నగరవాసులను రక్షించడంలో సర్కారు విఫలం చెందిందని తెలంగాణ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం నిజాంపేట బండారి లేఅవుట్లో రేవంత్రెడ్డి పర్యటించి, వరద బాధితుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరంలో పరిస్థితికి ప్రకృతి విపత్తు కంటే ప్రభుత్వ వైఫల్యమే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. నాలాల ఆక్రమణలపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు ఫోన్ తీయడం లేదని, ఇక సామాన్యప్రజల ఫిర్యాదులకు స్పందిస్తారా? అని ప్రశ్నించారు.
నాలా పరిస్థితిపై ఈవోతో మాట్లాడినట్లు రేవంత్రెడ్డి చెప్పారు. ఈవోతో మాట్లాడితే గంటలో నాలా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. తన ఫిర్యాదుపై స్పందించి ఆ పని చేయకపోతే ఇక్కడే బైఠాయిస్తానని పేర్కొన్నారు. శనివారం ఉదయం నిజాంపేట బండారి లేఅవుట్కు వెళ్లిన రేవంత్ రెడ్డికి బాధితులు సమస్యలను వివరించారు.
అధికారులు పట్టించుకోవడం లేదని, పాలు, మంచినీళ్లు కూడా అందడం లేదని, అపార్ట్మెంట్ సెల్లార్లో నీళ్లు తోడాలని ఫిర్యాదు చేస్తే అధికారులు రోజుకు రూ.10 వేలు ఇవ్వాలంటున్నారని వారు రేవంత్తో మొర పెట్టుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో సర్కారుని నిలదీస్తాం: ఉత్తమ్కుమార్రెడ్డి
హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన సంగతి తెలిసిందే. నీటిలో మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
శనివారం అల్వాల్ భూదేవీనగర్లో నీట మునిగిన ప్రాంతాన్ని ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సందర్శించారు. వరద బాధిత ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్షాల కారణంగా ఇళ్లు నీటమునిగిన ప్రజలకి ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు చేపట్టకుండా సర్కారు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.
వరదలపై ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి ఉందని అన్నారు. బాధితుల సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించాలని అన్నారు. ఇక బాధితులకి కాంగ్రెస్ పార్టీ తరుపున సాయం చేస్తామని చెప్పారు. వరదలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.