రేవంత్ బెయిల్, చంద్రుల కలయికపై ఉత్కంఠ: జగన్-టీఆర్ఎస్లకు పవన్ జవాబు!
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన మంగళవారం నాడు హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఇరువైపుల వాదనలు నాలుగు రోజుల క్రితం ముగిశాయి. జూన్ 30వ తేదికి హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
జెరూసలేం మత్తయ్య స్క్వాష్ పిటిషన్ కొట్టివేయాలన్న స్టీఫెన్ సన్ పిటిషన్ను హైకోర్టు బెంచ్ సోమవారం తిరస్కరించింది. మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అందరూ ఉత్కంఠగా ఉన్నారు.
రేవంత్ బెయిల్ పిటిషన్ పైన ఉత్కంఠకు తోడు మంగళవారం నాడు మరో సంఘటన పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్లో ఇరువురు సీఎంలకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు వచ్చే వారి రాక అందరిలోను ఉత్కంఠను రేపుతోంది.
మరోవైపు, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాల పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు స్పందించలేదు. తొలిసారి శనివారం నాడు ట్వీట్ చేశారు. సోమవారం నాడు మరోసారి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రులకు హితబోధ చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - బీజేపీలకు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ఓటుకు నోటు వ్యవహారంపై ఎందుకు స్పందించడంలేదని టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు కొద్దిరోజులుగా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాటిపై మాట్లాడేందుకు ముందుకు వస్తున్నారు.
రెండు రోజుల్లో లేదా వచ్చే వారంలో వీటిపై మాట్లాడుతానని ఆయన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ల పైన వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలు సానుకూలంగా లేవు. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారనే అంశం కూడా సస్పెన్స్గా మారింది.
పెదవి విప్పరేం అన్న టీఆర్ఎస్, వైసీపీలకు ఘాటుగా సమాధానం చెబుతారా? తన సమాధానంతో వారిని మెప్పిస్తారా? చంద్రబాబును తప్పు పడతారా? లేక కోర్టులపై భారం వేస్తారా? చూడాలి.
అయితే, పెదవి విప్పడం ద్వారా టీఆర్ఎస్, వైసీపీలకు సరైన సమాధానం చెప్పినట్లవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఓటుకు నోటు, సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై కర్ర విరగక, పాము చావక అన్న చందంగా పవన్ స్పందించే అవకాశాలు కొట్టిపారేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి.