ఎప్పుడో, ఎక్కడో చెప్పండి: ఇంద్రకరణ్కు రేవంత్ సవాల్, సారీ చెప్తానంటూ ఫైర్
తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్ల వార్ కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య సవాళ్ల వార్ కొనసాగుతోంది. గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై ఇంద్రకరణ్రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు రేవంత్రెడ్డి ప్రకటించారు. వేదిక ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
290 ఎకరాల్లో గృహ నిర్మాణాల కోసం ప్రభుత్వంతో గృహ నిర్మాణ సంస్థ ఒప్పందం చేసుకుందని.. ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్ల వల్ల నిర్మాణం ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రభుత్వం గడువు పెంచిందని.. 2004లో చేసుకున్న ఒప్పందాలు ఇంకా కొనసాగుతున్నాయని రేవంత్రెడ్డి ఆరోపించారు.
గృహ నిర్మాణ శాఖ 17 ప్రైవేటు నిర్మాణ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి లేదని చెప్పడం దారుణమన్నారు. ఉన్న భూములను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టి ఇప్పుడు పేదలకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
ఇప్పటివరకు పేదలకు కట్టించిన ఇళ్లు ఎక్కడున్నాయో చూపిస్తే ప్రభుత్వానికి క్షమాపణ చెప్తానని అన్నారు. గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఎంపికైన కాంట్రాక్టుల నుంచి ప్రభుత్వానికి రూ.3వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. గృహ నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకుని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వారికి అనుకూలంగా నడుచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.