రాజ్యసభకు పోటీ చేయట్లేదని రేవంత్ ఆగ్రహం, ఢిల్లీలో సంబంధాలు: డీఎస్
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కాంగ్రెస్ పార్టీ బరిలో నిలవలేదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెరాసతో కలిసి పని చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
తెరాసకు ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన వేటుకు ఆధారాలు లభించేవని, కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోలేదన్నారు. కాగా, రెండు రోజుల క్రితం మహానాడులో మాట్లాడుతూ.. 2019లో టిడిపి 99 సీట్లను గెలుచుకుంటుందని రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో నాకు సత్సంబంధాలు: డీఎస్
న్యూఢిల్లీలో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెరాస నేత డీ శ్రీనివాస్ అన్నారు. ఆయన, కెప్టెన్ లక్ష్మీకాంతా రావులు రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఢిల్లీలో తనకు ఉన్న సంబంధాలను, పరిచయాలను తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని చెప్పారు.
బంగారు తెలంగాణ సాధనకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. మూడేళ్లలో 80 శాతం ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే విశ్వాసం ఉందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేయడం గొప్ప భాగ్యం అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు.
తెలంగాణ ఉద్యమ ఫలితమే తాను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక అవడమని కెప్టెన్ లక్ష్మీ కాంతా రావు అన్నారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం పని చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పిస్తున్నందుకు ఈ సందర్భంగా సీఎం కెసిఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.