కుర్చీపై చినజీయర్, కేసీఆర్పై ప్రశ్నలు: సచివాలయం కూల్చివేత వెనుక.. కేటీఆర్!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం క్యాంప్ ఆఫీస్లోకి అడుగుపెట్టిన సమయం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొద్ది రోజుల క్రితం క్యాంప్ ఆఫీస్లోకి అడుగుపెట్టిన సమయంలో ముఖ్యమంత్రి సీటులో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టారని, సీఎం సీటులో ఆయనను కూర్చోబెట్టడం ఏమిటని టిడిపి యువనేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తుకు పనికిరాదన్న ఉద్దేశంతోనే దానిని కూలగొట్టి కొత్తది నిర్మించాలని ఆలోచిస్తున్నారని, ఇప్పటి నుంచే కేటీఆర్ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
చినజీయర్ స్వామిని కూర్చోబెడతారా?
సీఎం సీటులో చినజీయర్ స్వామిని కేసీఆర్ కూర్చోబెట్టడంతో తెలంగాణకోసం బలిదానాలు చేసుకున్న అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ గృహ ప్రవేశం సందర్భంగా సీఎం సీటులో చినజీయర్ స్వామిని కూర్చోబెట్టడం అభ్యంతరకరమన్నారు.
కొడుకు కోసం సచివాలయం కూల్చివేత
కొడుకును సీఎం చేయటానికి సచివాలయాన్ని కూల్చేసి రూ.1200 కోట్ల ప్రజాధనంతో కొత్త భవనం నిర్మించేందుకు పూనుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు.
సెల్ఫీలతో కేటీఆర్, సెల్ఫ్ డబ్బాతో కేసీఆర్
సెల్ఫీలతో కేటీఆర్, సెల్ఫ్ డబ్బాలతో కేసీఆర్ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. రైతు పోరు యాత్ర తరహాలో విద్యార్ధి పోరు పేరుతో యువజన సమస్యలపై యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తొమ్మిదో తేదీన వరంగల్ నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. కాకతీయ వర్సిటీలో సభకు అనుమతించకపోవడంతో వరంగల్లోని ఏకశిల పార్క్లో మొదటి సభ నిర్వహిస్తున్నారు. జనవరి 26వ తేదీ వరకూ ఈ పోరు బాట జరుగుతుంది.
కోదండరాంనే అంటారా
ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన కోదండరాంనే తెరాస నేతలు దూషించే దుస్థితి నెలకొందన్నారు. 1569 మంది రాష్ట్ర సాధనకు ఆత్మ బలిదానాలు చేస్తే వారికి ఇస్తామన్న రూ.10 లక్షలు, ఇంటికో ఉద్యోగం, ఇళ్లు, భూమి కేవలం 498 మందికి మాత్రమే పరిమితం చేసి చేతులెత్తేశారన్నారు.
ఆత్మహత్యలపై..
తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిరంగాల్లో రైతులను నిర్లక్ష్యం చేయడం, ముఖ్యంగా రుణాలు చెల్లించలేక 2007 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 432 మందిని గుర్తించి 42 మందికి మాత్రమే రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించారని, మిగిలిన వారిని విస్మరించారని ఆరోపించారు.
రైతు ఆత్మహత్యలపై...
రైతుల ఆత్మహత్యల్లో కేంద్ర ప్రభుత్వం తయారు చేయించిన నివేదిక ప్రకారం మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిల్చిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న గ్రామాలు తప్ప వేరే గ్రామాల్లో ఇళ్లను ఎందుకు నిర్మించలేదన్నారు.