'మహా' దగా ఒప్పందం, రేపే కుట్రను బయపెడ్తా: కెసిఆర్పై రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మహారాష్ట్రతో గోదావరి నదిపై తలపెట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసుకున్న ఒప్పందంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అది మహా దగా ఒప్పందమని ఆయన బుధవారంనాడు మీడియాతో అన్నారు.
మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన కుట్రను రేపే బయపెడతామని ఆయన అన్నారు. కేసులు పెడతామన్న కెసిఆర్ సవాల్ను స్వీకరిస్తున్నామని ఆయన అన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్పై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామని, దమ్ముంటే తమపై కేసులు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు.
మహా ఒప్పందంపై తెలంగాణ ప్రజలు నీటి హక్కులు కోల్పోతారన్నారు. కాసుల కక్కుర్తి కోసమే రీ డిజైనింగ్ చేశారని రేవంత్ ఆరోపించారు. రీ డిజైనింగ్ వల్ల తెలంగాణ ప్రజలపై వేల కోట్ల ఆర్థికభారం పడుతుందని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆత్మ బినామీ కంపెనీలకే కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా తెలంగాణకు అన్యాయం చేశారని, బాబ్లీపై సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు పోరాడారని రేవంత్రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. టెండర్లలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయనయ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కెసిఆర్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణాలను ఎందుకు ఆపేశారో కెసిఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి ఎత్తు తగ్గించడం వల్ల రూ..50 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. చేవెళ్ల ప్రాజెక్టును తొలగించి కాళేశ్వరాన్ని ఎందుకు చేర్చారో చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.