రేవంత్ విడుదలకు లాయర్లు పరుగులు: కెసిఆర్ ఫ్లెక్సీలకు చెప్పు దెబ్బలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ పత్రాలు మంగళవారంసాయంత్రం 5 గంటల దాటిన ఆయన న్యాయవాదులకు అందాయి. 5.30 గంటల కల్లా ఈ పత్రాలు చర్లపల్లి జైలుకు చేరాల్సి ఉంది.
దాంతో న్యాయవాదులు ఉరుకులు పరుగుల మీద బెయిల్ పత్రాలతో ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. బెయిల్ షరతుల మేరకు రూ.5 లక్షలకు సమానమైన ష్యూరిటీలు సమర్పించారు. ఏసీబీ కోర్టు జారీ చేసిన విడుదల పత్రాలు తీసుకుని వారు చర్లపల్లి జైలుకు వెళ్లారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు మంగళవారంనాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, రేవంత్రెడ్డి బెయిల్పై విడుదలవుతున్న సందర్భంగా చర్లపల్లి జైలు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా జైలులో ఉండి, బెయిల్పై విడుదలవుతున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టి, కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి విడుదల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుబం సభ్యులు ఆతురతతో ఎదురు చూస్తున్నారు.