కెసిఆర్ నా కళ్లలోకి సూటిగా చూడగలరా, హరీష్ కుంపటి పెడ్తారు: ఎర్రబెల్లి చేరికపై రేవంత్
హైదరాబాద్: ఇన్నాళ్లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రహస్య మిత్రులని తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు తెరాసలో చేరడంపై ఆయన బుధవారం సాయంత్రం స్పందించారు.
తెలంగాణలో కుల సమీకరణలు జరుగుతున్నాయని, దీన్ని బట్టే ఎవరికి తోచిన పార్టీల్లోకి వారు వెళుతున్నారని ఆయన తెలిపారు. టిడిపి మాదిరిగానే కేసీఆర్ పార్టీలోనే కాకుండా కేసీఆర్ కుటుంబంలో కూడా జరుగుతాయని రేవంత్ అన్నారు. భవిష్యత్తులో మంత్రి హరీష్ రావు కెసిఆర్కు కుంపటి పెడుతారని ఆయన జోస్యం చెప్పారు. ఇవాళ ఇతర పార్టీలకు ఉన్న పరిస్థితి రేపు తెరాసకు తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు.
గతంలో కేసీఆర్ను కలిసినప్పుడు అధిష్టానం ఎర్రబెల్లి తప్పును క్షమించిందని, అయినా ఎర్రబెల్లి తీరు మారలేదని ఆయన అన్నారు.పార్టీ మారినా కూడా ఎర్రబెల్లికేం ప్రయోజనం లేదని, అక్కడ నాయకుడిగా ఎర్రబెల్లిని ఎవరు చూడరనిస.బానిసగానే చూస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకుని వెనక్కి వస్తే బాగుంటుందని ఆయన సూచించారు.
స్పీకర్ పరిధిని మించి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇవి ముమ్మాటికి రాజ్యంగ వ్యతిరేక చర్యలేనని, దీనిపై మేం కోర్టుకెళ్లి పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. కెసిఆర్ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని చేర్చుకునే ధైర్యం ఉందా, శాసనసభలో తన కళ్లలోకి కెసిఆర్ సూటిగా చూడలేరని ఆయన అన్నారు.
పార్టీలో నుంచి ఎవరు పోయినా, ఎవరు ఉన్నా క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆయన చెప్పారు. అందరినీ సమన్వయం చేసి పార్టీపై పోరాటం చేస్తామని అన్నారు. బలహీనవర్గాల పార్టీ తెలుగుదేశమని ఆయన అన్నారు.
కొద్ది మంది నాయకులు వ్యక్తిగత అవసరాల కోసం ఒత్తిడికి లొంగి పోయారా, మరెందుకు పోయారో చెప్పలేం గానీ కెసిఆర్ పార్టీ ఫిరాయింపులతోనే కాలం గడుపుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ భారీ మూల్యం చెల్లించకతప్పదని అన్నారు.
టిడిపి నుంచి ఎవరు వెళ్లిపోయినా నష్టం లేదని ఆయన అన్నారు. ఒకరిద్దరు వెళ్లినంత మాత్రాన క్యాడర్ పార్టీని వదిలిపోదని అన్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేస్తూ కెసియార్ తన పార్టీలో చేర్చుకుంటున్నారని, కెసిఆర్ పైశాచికానందం పొందుతున్నారని ఆయన అన్నారు.