69 మందినా: కేసీఆర్ను ఏకేసిన రేవంత్, నేనూ కేసు వేస్తా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఆపరేషన్ బ్లూస్టార్లో భాగంగానే మైహోమ్స్ రామేశ్వర రావు తనపై నిందారోపణలు చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ దోపిడీకి సాయపడిన రామేశ్వర రావు తనపై కేసు వేయడంలో ఆశ్చర్యం లేదన్నారు. వేయకపోతేనే ఆశ్చర్యమన్నారు. రామేశ్వర రావు అక్రమాలను వివరాలతో సహా బయటపెట్టానని, తాను కూడా కేసు వేయబోతున్నానని చెప్పారు.
రుణమాఫీ జరగక అప్పులతో అవమానాల పాలై రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ వాస్తవాలను తొక్కిపెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి తప్పుడు నివేదిక పంపించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 670 మంది చనిపోతే 69 మంది అని చెబుతారా అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోతే తాము అందిస్తామన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,200 మంది యువకులు, విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారని గతంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడేమో 400 మందిని మాత్రమే అమరులుగా పేర్కొన్నారని, ఇదెక్కడి న్యాయమని రేవంత్ ప్రశ్నించారు.
ఎన్నికల ముందు దళితుడే సీఎం, దళిత వర్గాలకు మూడెకరాల భూమి, మూడు అరల ఇళ్ళు అని ప్రకటించిన కేసీఆర్ ఆ హామీలను పట్టించుకోకుండా, హుస్సేన్ సాగర్ చుట్టూ అద్దాల మేడలు, వంద అంతస్తుల భవనాలు నిర్మిస్తామని చెబుతున్నాడని, అవి ఎవరి కోసమని నిలదీశారు.
తెలంగాణలో కరువు ఉండగా, కరువు జిల్లాలను ప్రకటించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకుండాపోయిందని, ఫిల్మ్సిటీలు, చెరువు గట్లు, పార్కుల చుట్టూ తిరుగుతున్నాడని, పోకిరీ వాళ్లే అలా తిరుగుతారని, ఈ సీఎం పోకిరోడు అని వ్యాఖ్యానించారు.
రైతు ఆత్మహత్యలపై కబోదిలా ఉండకుండా ఇప్పటికైనా కళ్లు తెరవాలని, తెలంగాణలో 677 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని కేంద్రానికి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్కు సూచించారు. జిల్లాల పర్యటనల్లో ఉన్న టీ జేఏసీ చైర్మన్ కోదండరాం సైతం సుమారు 400 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెబుతున్నారన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుబాలకు రూ.50 వేల చొప్పున టీడీపీ అందించిందని తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల వివరాలు తమ దగ్గర ఉన్నాయని, 69 మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని ఏ ప్రాతిపదికన నివేదిక ఇచ్చారని నిలదీశారు.
రైతులు, వృద్ధులవి సర్కారీ హత్యలేనని, కేసీఆర్ నిర్లక్ష్య వైఖరి వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక కేసీఆర్ విచిత్ర పాలన కారణంగా పింఛన్లు రాక వృద్ధులు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆసరా పేరుతో ప్రభుత్వం అనవసర ఆర్భాటం చేస్తోందని, ఈ క్రమంలో అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు అందక కొందరు, ఉన్న పింఛన్లు పోతాయేమోనన్న ఆందోళనతో మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులను అవమానించారని, వారి ఉసురులో టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.
65 ఏళ్ళకు పింఛన్ అంటూ ప్రభుత్వం చెబుతోందని, అయితే 95-100 ఏళ్ళ వయోవృద్ధులకు సైతం పింఛన్లు అందడంలేదని ఆరోపించారు. వికలాంగులు, వితంతువుల పరిస్థితీ ఇలాగే ఉందన్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకోలేదంటూ వితంతువులు సర్టిఫికెట్లు తెచ్చుకోవాలా? కేసీఆర్కు ఏం పోయేకాలం? ఆయనకు తప్ప ఇంత నీచమైన ఆలోచన ఇంకెవరికీ రాదని, దీనికంటే పింఛను లేకపోయినా ఫర్వాలేదన్న పరిస్థితి నెలకొందన్నారు.