నేను ముఖ్యమంత్రిని అయ్యాక..: రెడ్డిలకు రేవంత్ రెడ్డి బంపరాఫర్
తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిని అయితే రెడ్డి కార్పొరేషన్, రెడ్డిల డిమాండ్లపై మొదటి సంతకం చేస్తానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిని అయితే రెడ్డి కార్పొరేషన్, రెడ్డిల డిమాండ్లపై మొదటి సంతకం చేస్తానని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం రెడ్డి మహా సభ జరిగిన విషయం తెలిసిందే.
తెలంగాణలో అలిగివెళ్లిపోయిన జేసీ దివాకర్ రెడ్డి
చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, విద్య, ఉద్యోగాల్లో వయోపరిమితి, ప్రత్యేక రిజర్వేషన్, గురుకులాల ఏర్పాటు, 50 ఏళ్లు నిండిన రైతులకు మూడు వేల పింఛను తదితర డిమాండ్లతో జాతీయ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మేడ్చల్ మండలం గౌడవెల్లిలో రెడ్డి మహాగర్జన సభ జరిగింది.
రేవంత్, డీకే అరుణ సహా..
ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, మల్లారెడ్డి, జంగారెడ్డి, జడ్పీ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు.
సీఎంలు కేంద్రమంత్రులుగా లేని పరిస్థితి..
తెలంగాణ రాష్ట్రం సాధించాక రెడ్డి కులస్థులు ఏ స్థాయిలో ఉన్నారో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు లేని దుస్థితి నెలకొందంటే రెడ్డిల్లో ఐకమత్యం లేకపోవడమే కారణమన్నారు.
మందకృష్ణ మాదిగను ఆదర్శంగా తీసుకొని..
ధర్మయుద్ధం పేరిట అయిదు లక్షల మందిని ఓ చోటుకి చేర్చి కులం ఐక్యతను చాటిన మందకృష్ణ మాదిగను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్రంలో రైలు పట్టాలపై కూర్చుని రెడ్డిలు తమ కార్పొరేషన్ కోసం రూ.1000 కోట్లు సాధించుకున్నారని, అదేవిధంగా ఇక్కడ కూడా కార్పొరేషన్లు సాధించుకోవాలన్నారు.
అప్పులపాలు చేస్తున్నారు
రెండు రాష్ట్రాల్లో సుమారు 500 కళాశాలలు రెడ్డిలవేనని, వాటిలో చదివే విద్యార్థులకు ఇస్తున్న ఫీజు రీయింబర్సుమెంట్లను నిలిపివేసి ముఖ్యమంత్రి కేసీఆర్.. రెడ్డి కులస్థులను అప్పులపాలు చేస్తున్నారన్నారు.
మహానేతలు భయపడ్డారని డీకే అరుణ
మహానేతలు సభకు రావడానికి భయపడ్డారని, ఓట్ల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే డీకే అరుణ ధ్వజమెత్తారు.
మల్లారెడ్డికీ చుక్కెదురు
ఎంపీ మల్లారెడ్డి రాజకీయాలపై మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా విమర్శించడంతో మాటలు మార్చి ప్రసంగించారు. కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కనకారెడ్డి, మహిళా అధ్యక్షురాలు గంగుల శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.