ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త, మండిపడ్డ రేవంత్! 'మోత్కుపల్లికి గవర్నర్గిరి'
హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఓ శుభవార్త. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల ప్రమోషన్ల పైన ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఉద్యోగుల ప్రమోషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మంగళవారం నాడు ప్రకటించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగుల ప్రమోషన్ల రద్దు ఉత్తర్వులను టిఆర్ఎస్ సర్కార్ రద్దు చేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పైన రేవంత్ ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం సేవలు అందడం లేదన్నారు. అమలు కానీ హామీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన అన్నారు. పార్టీ బలోపేతంపై త్వరలో దృష్టి పెడతామన్నారు.
సెంటిమెంట్ వల్లే ఓడిపోయాం: మోత్కుపల్లి
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి చెంపలు వేసుకుంటున్నారని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సెంటిమెంటు వల్లే గత ఎన్నికల్లో నష్టపోయామని చెప్పారు. ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. నిజాంపై పోరాడిన ప్రాంతం తెలంగాణ అని, కేసీఆర్ కుటుంబంపై పోరాడటం తప్పదన్నారు.
మోత్కుపల్లి గవర్నర్ అవుతారు: రమణ
తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతారని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలను కాపాడిన ఘనత తమదే అన్నారు. మాలాంటి వాళ్లు నేతలు అయ్యారంటే ఆ ఘనత ఎన్టీఆర్దే అన్నారు. రాష్ట్రంలో ఫాంహౌస్ పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.