లాయర్లు లేట్: ఈ రాత్రికి జైల్లోనే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదని సామెతగా తయారైంది టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పరిస్ధితి. ఓటుకు నోటు కేసులో హైకోర్టు బెయిల్ మంజారు చేసినా, రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించకపోవడంతో మరో జైలులోనే గడపాల్సిన పరిస్ధితి వచ్చింది.
దీంతో జైలు నుంచి విడుదల అయ్యేందుకు మరో రోజు వేచి ఉండక తప్పేలా లేదు. హైకోర్టు రూ. 5 లక్షల వ్యక్తిగత పూచీ కత్తుతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజారు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి ఖైదీలను సాయంత్రం 6 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ లోపే లాంఛనాలన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అయితే, హైకోర్టు నుంచి బెయిల్ పేపర్లు ఏసీబీ కోర్టుకు చేరుకున్నా, రేవంత్ తరఫు న్యాయవాదులు తగిన సమయంలో ష్యూరిటీ పేపర్లు సమర్పించ లేకపోయారు. దీంతో మంగళవారం రాత్రంతా జైలులోనే రేవంత్ రెడ్డి గడపాల్సిన పరిస్ధితి వచ్చింది.
బుధవారం ఉదయాన్నే రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదల కానున్నారు. దాదాపు నెల రోజులుగా జైలులో ఉండి, బెయిల్పై విడుదలవుతున్న తమ నాయకుడికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ రోజు రేవంత్ విడుదల కారన్న సమాచారంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఏసీబీ కోర్టుకు రేవంత్ బెయిల్ పేపర్లు
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంజూరైన బెయిల్ కాపీ ఏసీబీ కోర్టుకు చేరుకుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి రాష్ట్ర హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రేవంత్ బెయిల్ కాపీని ఏసీబీ కోర్టుకు అందజేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాదులు సరైన సమయంలో ష్యూరిటీలను సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో రేవంత్ రెడ్డి విడుదల ఆలస్యం అయింది. ఈ బెయిల్ కాపీని రేవంత్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నచర్లపల్లి జైలుకు పంపనున్నారు.