శవాలపై చిల్లర ఏరుకునే వారి కంటే, కమీషన్లు తీసుకుంటారా: కేసీఆర్పై రేవంత్
కరీంనగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్రంగా మండిపడ్డారు. శవాల పైన చిల్లర ఏరుకునే వారి కంటే సీఎం కేసీఆర్ అధ్వాన్నంగా ఉన్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ బృందం మంగళవారం మిడ్ మానేరు గండిని పరిశీలించింది. భారీ వర్షాల కారణంగా మిడ్ మానేరుకు గండి పడిన విషయం తెలిసిందే. దీనికి పనులు ఆలస్యమే కారణమని సీఎం కేసీఆర్ మండిపడుతూ.. తాజా టెండర్లు రద్దు చేసి, కొత్త టెండర్లు పిలవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
తెలియక చెప్పా: 'డబుల్' షాక్పై కేసీఆర్ క్షమాపణ, అక్కడా అలాగేనని పొన్నం
ఈ నేపథ్యంలో రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు గండికి మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వర రావుల నిర్వాకమే కారణమన్నారు. మొదటి కాంట్రాక్ట్ రద్దు చేసి తుమ్మల బంధువుకు ఎందుకు కాంట్రాక్ట్ అప్పగించారో చెప్పాలని నిలదీశారు.
మామా, అల్లుడు కోట్లాది రూపాయల కమీషన్లు పొంది 19 శాతం లెస్తో తుమ్మల బంధువుకు కాంట్రాక్ట్ అప్పగించారన్నారు. కాంట్రాక్టర్ ఇచ్చిన కమీషన్ డబ్బులే గత ఉప ఎన్నికల్లో వెదజల్లి గెలిచారని రేవంత్ ఆరోపించారు.
దీని పైన బహిరంగ చర్చకు వస్తే ఆధారాలతో నిరూపించేందుకు తాము సిద్ధమని చెప్పారు. శవాల పైన చిల్లర ఏరుకునే వారికంటే కేసీఆర్ అధ్వానం అన్నారు. మిడ్ మానేరు బాధితులను పరామర్శించని సీఎం మనకు ఎందుకని ప్రశ్నించారు.
ప్రజా సమస్యల పైన అవగాహన లేని, పట్టింపులేని కేసీఆర్.. ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరమన్నారు. ఇప్పటికీ నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇస్తే తామైనా నిధులు తీసుకు వస్తామన్నారు.
మిడ్ మానేరు గండితో పంట పొలాలు అక్కరకు రాకుండా పోయిన రైతులకు ఎకరాకు రూ.20 లక్షలు ఇవ్వాలన్నారు. మన్వాడను ముంపు గ్రామంగా ప్రకటించి తగిన పరిహారం చెల్లించడంతో పాటు డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలన్నారు.