ఆంధ్రోళ్లకు టిక్కెట్లు అమ్ముకున్నారు: ఖేడ్లో రేవంత్ రెడ్డి 'గ్రేటర్', హరీష్ ఆగ్రహం
మెదక్: తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ అంటూ టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై తెలంగాణ టిడిపి నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం విరుచుకుపడ్డారు. టిడిపి తెలంగాణలో పుట్టిన పార్టీ అని, తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ అన్నారు.
తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ నేతలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్రోళ్లకు ఇరవై టిక్కెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో ఖాజా సూర్యనారాయణ, వెంగళరావునగర్లో మనోహర్రావు, సోమాజిగూడలో విజయలక్ష్మి, అమీర్పేటలో శేషుకుమారి, దిల్సుఖ్నగర్లో వెంకటేశ్వర్లకు టిక్కెట్లు ఇచ్చారని, వీరంతా ఎక్కడివారో, ఎవరికి చుట్టాలో చెప్పాలన్నారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో భాగంగా శనివారం ఆయన టిడిపి అభ్యర్థి విజయ్ పాల్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ మేకవన్నె పులి అని, అలాంటి నాయకులను నమ్మితే మోసపోవడం ఖాయమన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలు ప్రస్తుతం నారాయణఖేడ్ వైపు చూస్తున్నారన్నారు.
కెసిఆర్, హరీశ్ రావు ఇలా అందరూ 'రావు'లే అని వారిని నమ్మితే పేదలకు ఏమీ రావన్నారు. సింగూరు ప్రాజెక్టు ఎండిపోవడానికి కారణం టిఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. పేదల పక్షాన ఉన్న టిడిపి తెలంగాణలో ఉండకూడదన్న కుట్ర జరుగుతోందని, దీన్ని తిప్పికొడతామన్నారు.
ఆ రెండు పార్టీలు కనుమరుగు: హరీష్ రావు
వరుస ఎన్నికల్లో ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంటున్న టిడిపి, కాంగ్రెస్ దిక్కుతోచక కనుమరుగైపోతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ నేతల మైండ్బ్లాంక్ అయిందని, ఆ పార్టీలను ప్రజలు కరివేపాకులా తీసిపారేశారని, నీకు ఇక్కడేంపని.. ఏపీకి వెళ్లాలంటూ చంద్రబాబును పొలిమేర వరకు తరిమేశారన్నారు.
ఇంకా ఏముందని నారాయణఖేడ్లో ప్రచారాని వస్తారు అని కాంగ్రెస్, టీడీపీ నేతలను హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆ రెండు పార్టీల దుకాణాలు మూతపడ్డాయని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్కు దిష్టితగులొద్దనే టీడీపీకి ఒకటి, కాంగ్రెస్ను రెండుస్థానాల్లో ప్రజలు గెలిపించారన్నారు.
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భాగంగా శనివారం కంగ్టి మండలంలోని సుక్కల్తీర్థ్, గాజుల్పాడ్, పొట్పల్లి, నాగన్పల్లి, గరిడేగామ్ గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రచార సభల్లో పాల్గొన్నారు.