మసాజ్ సెంటర్పై దాడిలో గర్ల్స్ అరెస్ట్, యువతికి అసభ్య మెసేజ్లు
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. బంజారాహిల్స్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై వెస్ట్ జోన్ డీసీపీ స్పెషల్ టీంలు శనివారం రాత్రి దాడులు చేశాయి. ఈ దాడుల్లో 21 మందిని అరెస్ట్ చేశాయి.
వీరిలో 10 మంది థాయ్లాండ్కు చెందిన యువతులు, నలుగురు పశ్చిమ బెంగాల్కు చెందిన యువతులు, నలుగురు మసాజ్ చేయించుకుంటున్న యువకులు ఉన్నారు.
యువతికి వేధింపులు, నిందితుడి అరెస్టు
ఓ యువతి పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి అసభ్యకరమైన పోస్ట్టింగ్లు చేస్తూ సెల్ఫోన్కూ అలాంటి సందేశాలు పంపుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వరం మండలం తుక్కుగూడకు చెందిన ఓ యువతికి సంబంధించి కొందరు గోడలపై అసభ్యకరమైన రాతలు రాశారు.
కొన్నాళ్లకు లోయర్ ట్యాంక్బండ్ వద్ద గల ప్రజా మూత్రశాలల వద్ద ఇదే రాతలతోపాటు సెల్ నెంబర్ రాశారు. అప్పటి నుంచి ఆ యువతికి అసభ్యకర ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తర్వాత ఎవరో ఫేస్బుక్ నకిలీ ఖాతా తెరిచి తుక్కుగూడ పరిసర ప్రాంతాల వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపాడు. దీనిపై ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.
విచారణ నిర్వహించిన పోలీసులు తుక్కుగూడకు చెందిన ప్రవీణ్ ఇదంతా చేశాడని తేల్చారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్న ప్రవీణ్ ఆమెతో మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత ఆమె అతడితో మాట్లాడడం మానేసింది. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ ఈ విధంగా వేధించడం మొదలుపెట్టాడు.
ఆమెను వేధించడానికి బాధితురాలి భర్త ఓటరు కార్డును ఉపయోగించి ప్రత్యేకంగా ఒక సిమ్ను కొనుగోలు చేశాడు. దాని ద్వారా ఆమె ఫోన్కు అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. ప్రవీణ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.