వైఎస్ మృతితో మార్పు: నాడు కెసిఆర్ రిజైన్ చేయాలనుకున్నారా!?
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు డౌన్ అయినప్పుడు ఆయనకు మీడియా మద్దతుగా నిలిచిందని, 2009 ఎన్నికల్లో పది సీట్లే రావడంతో కెసిఆర్ బాధపడి, టీఆర్ఎస్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోతానని చెప్పారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చెప్పారు.
నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ను వైండప్ చేయడానికి ప్రణాళికలు వేశారని, ఈ లోగానే ఆయన మరణించారని చెప్పారు. దాంతో పరిస్థితులు మారాయని చెప్పారు. ప్రజలు కోరుకుంటున్నారని, వారిలో తెలంగాణ భావన బలంగా ఉన్నందునే మీడియా అండగా నిలిచిందని చెప్పారు.
ఎప్పటికి మీడియాకు సొంత మీడియా లేదని చెప్పారు. డెట్రాయిట్లో తానా వేడుకల్లో రాధాకృష్ణ మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సాక్షితో, కెసిఆర్ నమస్తే తెలంగాణతో ఆంధ్రజ్యోతిని పోల్చవద్దని కోరారు.
కొందరు రాజకీయ నాయకులు పత్రికలు, టీవీలు పెట్టినందువల్ల మీడియా మొత్తాన్ని అనొద్దని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రజ్యోతి అనుకూలంగా పని చేసిందనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. మీడియా కూడా ఉద్యమాన్ని హైలెట్ చేసిందని వేమూరు రాధాకృష్ణ చెప్పారు.