దొంగచాటుగా తరలిస్తున్న రూ. 76లక్షల కొత్త నోట్లు సీజ్
రంగారెడ్డి: జిల్లాలోని కొత్తూరు రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించగా భారీ మొత్తంలో కొత్త నోట్లు పట్టుబడ్డాయి. ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 82లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో రూ. 76లక్షలకు కొత్త నోట్లే ఉండటం గమనార్హం.
ప్రజల ఆందోళన
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లభించకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని పలు బ్యాంకుల వద్ద ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ ఆంధ్రాబ్యాంకు అధికారులు నగదు లేదని చెప్పడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ఎన్ఐఆర్డీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి. ఖాతాదారుల ఆందోళనను చిత్రీకరించిన బ్యాంకు మేనేజర్ పై కస్టమర్లు దాడి చేసినంత పని చేశారు. ఇక ఉత్తరాదిన యూపీ, బీహార్ లలో బ్యాంకుల అద్దాలు పగులగొట్టి, ఫర్నీచర్ ధ్వంసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో నగదు లభ్యత మరింత ఘోరంగా ఉంది. బ్యాంకులకు నగదు రావడం ఇలాగే ఆలస్యమవుతుంటే, ప్రజల్లో మరింత అసహనం పెరిగి బ్యాంకులపై దాడుల ఘటనలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.