హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆదివారం హైదరాబాద్కు రానున్నారు. రియో ఒలింపిక్స్లో భారత్కు రజత పతకం సాధించిన తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సచిన్ టెండూల్కర్ బీఎండబ్ల్యూ కారు అందించనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని గోపీచంద్ అకాడమీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
పీవీ సింధుతో పాటు రియో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన దీపా కర్మాకర్, సాక్షిమాలిక్లతో పాటు సింధు కోచ్ గోపీచంద్ కూడా సచిన్ చేతుల మీదుగా బీఎండబ్యూ కార్లు అందుకోనున్నారు. రియో ఒలింపిక్స్లో ఫైనల్స్కు సింధు చేరిన వెంటనే అక్కడే ఉన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్ను ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి రియో ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఎవరైనా సరే పతకం సాధిస్తే వారికి బహుమతిగా బీఎండబ్ల్యు కారుని ఇస్తానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన మాటకు కట్టుబడి రియోలో భారత్కు మరో పతకాన్ని ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది.
సచిన్ చేతుల మీదుగా కారు అందుకోనుండటం సంతోషం: సింధు
సచిన్ చేతుల మీదగా కారు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు హర్షం వ్యక్తం చేసింది. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సచిన్ తన కోసం రెడ్ కలర్ కారు సెలెక్ట్ చేశారని తెలిసిందని అన్నారు. ఇకపై రోజూ అకాడమీకి కారులోనే వస్తానని చెప్పుకొచ్చింది.
రియో ఒలింపిక్స్ తర్వాత ప్రస్తుతం బిర్యానీ, ఐస్ క్రీంలతో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన సింధు, బ్రాండ్ విలువ గురించి అంతగా పట్టించుకోనని చెప్పింది. తన దృష్టంతా ఆటపైనే ఉంటుందని, త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడతానని చెప్పింది. కాగా, ఒలింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న సింధుకు బహుమతులు వెళ్లువెత్తుతూనే ఉన్నాయి.
ఒలింపిక్స్లో పతకం గెలిస్తే కారు గిఫ్ట్ ఇస్తానన్న సచిన్ ఆదివారం సింధుకు బహుమతిగా రెడ్ కలర్ బీఎమ్డబ్ల్యూను బహూకరించనున్నట్టు చాముండేశ్వరినాథ్ చెప్పారు. టోక్యోలో సింధు గోల్డ్ గెలిస్తే హెలికాఫ్టర్ ఇవ్వాలేమో అంటూ ఆయన ఛలోక్తి విసిరారు. సింధుకు బహుమతిగా ఇచ్చే కారును సచిన్ స్వయంగా సెలక్ట్ చేశాడని చెప్పారు. ఇది సింధుకు తానిచ్చే మూడో కారు అని చాముండేశ్వరినాథ్ తెలిపారు.