ఊహించిందే జరిగింది: నరేశ్ను హత్య చేసింది స్వాతి తండ్రే! విషాదాంతమైన ప్రేమ కథ(ఫోటోలు)
చాకలి కులానికి చెందిన నరేశ్ స్వాతిని వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే ఆమె తండ్రి ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరెడ్డి మండలంలో బాగా సంపన్నుడు అని చెబుతున్న
భువనగరి: ఊహించిందే నిజమైంది.. తల్లిదండ్రుల ఆవేదన.. దళిత సంఘాల ఆరోపణే అసలు నిజమని తేట తెల్లమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్వాతి, నరేశ్ ల ప్రేమ చివరకు విషాదాంతంగానే ముగిసింది. అదృశ్యమైపోయాడనుకున్న నరేశ్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి కిరాతకంగా హత్య చేసినట్లు నిర్దారణ అయింది.
ట్విస్ట్ ల మీద ట్విస్ట్: స్వాతి ఆరోపణలను ఖండించిన నరేష్ సోదరి నీలిమ, వారిద్దరూ పూణెలోనే
పెళ్లి పేరుతో ఇద్దరిని భువనగిరికి పిలిపించిన శ్రీనివాసరెడ్డి.. స్వాతి పేరు మీద ఉన్న పొలంలోనే నరేశ్ ను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు తేలింది. హైకోర్టు జోక్యంతో అలసత్వం వీడిన పోలీసులు విచారణకు పదును పెట్టడంతో.. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి నిజం అంగీకరించాడు. శ్రీనివాసరెడ్డి సోదరుడు డ్రైవర్ సత్తిరెడ్డి కూడా ఈ హత్యలో పాలుపంచుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం నిందితులు ఎల్బీనగర్ డీసీపీ స్పెషల్ టీమ్ అదుపులో ఉన్నారు.
ఇలా మొదలైంది:
భువనగరి మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన నరేష్ తల్లిదండ్రులు ముంబైలో ఉంటారు. నరేష్ మాత్రం పల్లెర్ల గ్రామంలోని తాత ఇంటి వద్ద ఉంటూ భువనగిరిలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇదే క్రమంలో వలిగొండకు చెందిన స్వాతి అనే అమ్మాయి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. స్వాతి అప్పటికే ప్రగతి కాలేజీలో డిగ్రీ పూర్తిచేసింది. ఫేస్ బుక్ పరిచయం కాస్త వీరి మధ్య ప్రేమకు దారితీసింది.
ముంబైలో వివాహం:
గత మార్చి 25న ముంబై వెళ్లిన నరేశ్, స్వాతి అక్కడే వివాహం చేసుకున్నారు. వివాహ విషయం తెలుసుకున్న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి.. వారికి ఫోన్ చేసి మాయ మాటల ద్వారా భువనగిరికి రప్పించాడు. మన కుటుంబాల మధ్య గొడవలు ఉండవద్దని, తానే దగ్గరుండి వివాహం జరిపిస్తానని నమ్మబలికాడు.
నిజమేననుకుని వస్తే!:
శ్రీనివాసరెడ్డి మాటలు విని నరేశ్, స్వాతి ఇద్దరు భువనగిరికి రాగా.. స్వాతిని తీసుకుని ఆమె తండ్రి వెళ్లిపోయాడు. అప్పటినుంచి నరేశ్ అదృశ్యమైపోయాడు. ఎంత వెతికినా.. ఎన్ని రకాలుగా ఆలోచించినా.. ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే నరేశ్ తల్లిదండ్రులు, దళిత సంఘాలు మాత్రం శ్రీనివాసరెడ్డి పైనే తొలి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాయి.
కానీ పోలీసులు మాత్రం నిందితులకు సహకరించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. దీంతో విచారణలో అసలు నిజాలు మరుగునపడిపోయే ప్రమాదం ఏర్పడింది.
స్వాతి ఆత్మహత్య:
నరేశ్ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే స్వాతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. నరేశ్ తల్లిదండ్రులు తనను కట్నం కోసం వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేయడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.
నిజానికి స్వాతి ఆత్మహత్య చేసుకుందా? లేక ఇది హత్యనా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు స్వాతి రాసుకున్న డైరీల్లో నరేశ్ పట్ల ఆమెకు ఉన్న ప్రేమ స్పష్టమైంది.
కోర్టులో పిటిషన్ తో కదలిక:
పోలీసులు నిందితులకు సహకరించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో నరేశ్ తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించి పిటిసన్ దాఖలు చేశారు. అలాగే హోంమంత్రిత్వ శాఖకు కూడా లేఖ ఇచ్చారు. జోక్యం చేసుకున్న కోర్టు.. జూన్1 లోగా నిందితులెవరో తేల్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పోలీసుల విచారణలో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజం అంగీకరించాడు. స్వాతి మీద రిజిస్టర్ చేసిన పొలంలోనే నరేశ్ ను హత్య చేసి రబ్బర్ టైర్లతో మృతదేహాన్ని కాల్చి.. ఆపై బూడిదను పూడ్చిపెట్టినట్లు శ్రీనివాసరెడ్డి అంగీకరించాడు. దీంతో నరేశ్-స్వాతిల కులాంతర వివాహం విషాదంతంగా మిగిలిపోయింది.