కెసిఆర్ ఝలక్, న్యాయాధికారుల ఆందోళన: హైకోర్టు విభజనపై కదిలిన కేంద్రం
న్యూఢిల్లీ: హైకోర్టు విభజనపై తాను ఢిల్లీలో ధర్నాకు దిగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన హెచ్చరిక, న్యాయాధికారుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్నారు.
హైకోర్టును విభజించే అంశంపై సదానంద గౌడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చిస్తారు. హైకోర్టు విభజనపై,త న్యాయాధికారుల ఆప్షన్ల రద్దుపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నారు. ఇదిలావుంటే, తెలంగాణ న్యాయవాదులు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సందానంద గౌడలను, డివోపిటి ప్రతినిధి జితేందర్ సింగ్ను కలిశారు.
న్యాయాధికారుల నియామాకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయాధికారులు రోడ్డెక్కారు. హైకోర్టు 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడతో సమావేశమై వివరాలను అందించారు.
కాగా, కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై తీవ్రంగాధ్వజమెత్తారు. ఢిల్లీలో ధర్నా చేయడానికి కెసిఆర్ సిద్ధపడినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. కెసిఆర్ మరో కెజ్రీవాల్ కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
జడ్జిల సస్పెన్షన్ను ఎత్తివేయాలని తెలంగాణ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాదులో డిమాండ్ చేశారు. రెండేళ్లుగా విశ్వవిద్యాలయాలపై నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల నియామకాల్లో ప్రభుత్వ జోక్యం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. వెంటనే వీసీలను నియమించాలన్న ఆయన త్వరలో గవర్నర్కు వినతిపత్రం ఇస్తామని తెలిపారు.
జానా రెడ్డి ప్రకటన
హైకోర్టు విభజనలో జాప్యం వల్ల తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి అన్నారు. న్యాయమూర్తుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో అన్నారు. హైకోర్టు న్యాయాధికారుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.
న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని జానా రెడ్డి ఖండించారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ను ఎత్తేయాలని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైకోర్టు విభజనకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుతో చర్చలు జరపాలని, అందుకు తమ మద్దతు ఉంటుందని జానా రెడ్డి చెప్పారు.