సండ్రకు కోర్టు అనుమతి: ఎసిబికి చేరిన ఫోరెన్స్ ల్యాబ్ తుది నివేదిక
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సమావేశాలకు హాజరయ్యేందుకు కోర్టు అనుమతినిచ్చింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఓటుకు నోటు కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన టీటీడీ బోర్డు సభ్యుడు కావడంతో ఏసీబీ కోర్టు సమావేశాలల్లో పాల్గోనేందుకు అనుమతినిచ్చింది.
కాగా, ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తుది నివేదికను ఎసిబి చేతుల్లోకి వచ్చింది. ఎసిబి అధికారులు ఆ నివేదికను అధ్యయనం చేస్తున్నారు. దీన్ని ఆధ్యయనం చేసిన తర్వాత మరో రెండు మూడు రోజుల్లో ఎసిబి అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఎసిబి అధికారులు పలువురుని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్ రెడ్డిని కూడా ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిని, ఆయన అనుచరులు సైదులును, మరొకరిని ప్రశ్నించారు. కేసును బలంగా తయారు చేయడానికి ఎసిబి తిరుగులేని సాక్ష్యాలను సేకరించడంలో నిమగ్మమై ఉంది.