ఎసిబి ముందుకు సండ్ర, జిమ్మి: విచారణా, అరెస్టా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి ముందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, జిమ్మి రానున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. వారిద్దరిని ఎసిబి అరెస్టు చేస్తుందా, వారిని విచారించి వదిలేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎసిబి ముందు హాజరుకానున్నారు.
విచారణకు హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఏసీబీ సండ్రకు రెండు రోజుల క్రితం నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5లోగా ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. కాగా, సండ్ర సోమవారం ఉదయం 11 గంటలకల్లా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకోనున్నట్టు సమాచారం. సండ్రతోపాటు కేసులో కొత్త వ్యక్తిగా చేరిన సెబాస్టియన్ స్నేహితుడు జిమ్మి కూడా విచారణకు హాజరుకానున్నారు.
అయితే ఓటుకు నోటు కేసులో సోమవారం సాయంత్రం కల్లా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సండ్ర, జిమ్మిల నుంచి రాబట్టే సమాచారం ఆధారంగా కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు జారీ చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అరెస్ట్ చేస్తుందంటూ ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
సండ్రకు ఏసీబీ జారీ చేసిన మొదటి నోటీసులో సిఆర్పిసి 160 సెక్షన్ సాక్షిగా విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఏసీబీ జారీ చేసిన రెండో నోటీసులో మాత్రం సిఆర్పిసి 41ఏ కింద (కేసుతో సంబంధం ఉన్న వ్యక్తి) విచారణకు రావాలని పేర్కొంది. ఓటుకు నోటు కుట్రలో సండ్రను తొలుత సాక్షిగా మాత్రమే పరిగణించిన ఏసీబీ, కేసు దర్యాప్తులో భాగంగా అతడిని కుట్రలో స్వయంగా ప్రమేయం ఉన్న వ్యక్తిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. సండ్రను ఏసీబీ అరెస్ట్ చేయనుందన్న ఊహాగానాలకు ఇది మరింత బలం చేకూరుస్తోందంటున్నారు.
నోటుకు ఓటు కేసును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం, రేవంత్రెడ్డి బెయిలు రద్దుపై సుప్రీంలో ఎదురు దెబ్బ తగలడంతో ఏసీబీ కూడా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో కేసు విషయంలో ఎసిబి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సండ్రతోపాటు జిమ్మి అనే మరో వ్యక్తికి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రే నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.