రాతంత్రా ఎసిబి కార్యాలయంలోనే సండ్ర: సొమ్మసిల్లిన భార్య
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో తెలంగాణ ఎసిబి చేతిలో అరెస్టయిన తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య రాత్రంతా ఎసిబి కార్యాలయంలోనే గడిపారు. ఆయనను ఎసిపి అధికారులు సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను రాత్రంతా కార్యాలయంలోనే ఉంచారు. మంగళవారం ఉదయం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే క్రమంలో సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేలతో 23 సార్లు మాట్లాడినట్లు ఎసిబి అధికారులు చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసులో సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేసినట్లు తెలియగానే ఆయన భార్య మహాలక్ష్మి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఖమ్మంలో సండ్ర కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతోపాటు పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు. తన భర్త సండ్ర అరెస్టయినట్లు తెలియగానే ఆమె స్పృహ తప్పి పడిపోయినట్లు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి అరెస్టు అయిన మూడు రోజులకు తన వద్దకు అధికార పార్టీకి చెందిన మధ్యవర్తులు వచ్చారని, ఈ కేసులో తనపై కేసు పెట్టే అవకాశముందని చెప్పారని ఆయన ఇటీవల మీడియాతో అన్నారు. టీఆర్ఎస్లో చేరితే కేసులు, అరెస్టులు ఉండవని చెప్పినట్లు ఆయన తెలిపారు. మూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని హెచ్చరించారని, తాను ఇలాంటి వాటికి భయపడే వాడిని కానని, అన్నింటికి సిద్ధపడే ఉన్నానని వారికి చెప్పి పంపించివేశానని అని అన్నారు.
తనను అరెస్టు చేయడం తథ్యమని సండ్ర ముందుగానే అంచనాకు వచ్చినట్లు అర్థమవుతోంది. సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా ఆయన తమ పార్టీ సహచరులు, మీడియాకు ఈ విషయం చెప్పారు. ఏసీబీ కార్యాలయానికి వెళ్లే ముందు సండ్రను మాదిగ దండోరా ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ కలిశారు. వెంకట వీరయ్య సుదీర్ఘ కాలంగా మంద కృష్ణ మాదిగకు సన్నిహితుడు.