రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే: తేల్చేసిన నివేదిక
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక మరణం ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ నిపుణులు నివేదికలో స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిపుణులు గురువారం ఈ మేరకు వరంగల్ పోలీసులకు నివేదికను పంపారు. ఈ నెల 4వ తేదీన సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక(35), మనవళ్లు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3) అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే.
గ్యాస్లీక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి వస్తువులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఎంజీఎంలో పోస్టుమార్టం సమయంలో కూడా విస్రా టెస్టు కోసం శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించారు. పోలీసులు పంపిన శాంపిల్స్పై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇరవై రోజుల పాటు పరీక్షలు జరిపిన నిపుణులు చివరకు వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు.
గ్యాస్ లీక్ వల్ల వ్యాపించిన మంటల కారణంగానే సారికతో పాటు ముగ్గురు చిన్నారులు కాలిపోయినట్లు తేల్చారు. వారు నలుగురు కూడా ఊపిరి ఆడకపోవడం వల్లనే మరణించినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో స్పష్టం చేశారు. నలుగురు కూడా హత్యకు గురైనట్లు ఆనవాళ్లు లేవని చెప్పారు. వారు తీసుకున్న ఆహారంలో కూడా ఏ విధమైన విషపదార్థాల ఆనవాళ్లు లేవని చెప్పారు. వారు బతికి ఉండగానే గ్యాస్ లీక్ కారణంగా వ్యాపించిన మంటలకు ఆహుతి అయ్యారని స్పష్టం చేశారు.
వారి గొంతు, ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు స్పష్టం చేశారు. హత్య చేసిన తర్వాత శరీరాలు కాలిపోయినట్లయితే ఊపిరి తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి శరీరంలోకి పొగ చేరదని నివేదికలో చెప్పారు. సారికది, ఆమె కుమారులది ఆత్మహత్యేనని తేలడంతో ఆ బలవన్మరణాలకు గల కారణాలు బయటపడాల్సి ఉంది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దృష్టి పెట్టారు.
అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసిన పోలీసులు రాజయ్యతో సహా సారిక భర్త, ఇతర కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్కుమార్, అనిల్ రెండో భార్య వరంగల్ కేంద్ర కారాగారంలో ఉన్నారు. రాజయ్య బెయిల్ కోసం పిటిషన్ను దాఖలు చేసినా కోర్టులో చుక్కెదురైంది.