ఎన్నికల్లో గెలుపు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూతురుకి టీడీపీ ఝలక్
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచి పదవికి శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి టీడీపీ అభ్యర్థి షాకిచ్చారు. ఇది ఓ రకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి కూడా షాక్. ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి కూతురు కోవా అరుణ.
టీడీపీకి చెందిన మర్సుకోల సరస్వతి ఘన విజయం సాధించారు. కోవా లక్ష్మి గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె రాజీనామా చేయడంతో సర్పంచ్ పదవికి ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన సరస్వతి పోటీ చేశారు.
టీడీపీ మద్దతిచ్చిన సరస్వతికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలికింది. దీంతో కోవా అరుణ పైన సరస్వతి 2896 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. బెల్లంపల్లి మండలం కన్నాల పంచాయతీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో మంద అనిత.. ప్రత్యర్థి పైన 90 ఓట్ల తేడాతో గెలిచారు. చొండి గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.
అసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో... 14,278 ఓట్లకు గాను 8,731 ఓట్లు పోలయ్యాయి. ఇందులో సరస్వతికి 5,763, కోవ అరుణకు 2,869 ఓట్లువచ్చాయి. గెలిచిన సరస్వతి ఎమ్మెల్యే కోవ లక్ష్మికి సోదరి. 2013 సర్పంచ్ ఎన్నికల్లో కోవా లక్ష్మిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అక్క కూతురుపై సరస్వతి గెలిచారు.
ఇదిలా ఉండగా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ మద్దతుదారులు ఘన విజయం సాధించారు. వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లి పంచాయతీ సర్పంచ్గా ఆడెపు దయాకర్, నర్సంపేట మండలం కమ్మపల్లి సర్పంచిగా అజ్మీర విజయ, చేర్యాల మండలం తాడూరు సర్పంచ్గా నర్ర పద్మ, ఘనపూర్ మండల్ నష్కల్ సర్పంచిగా రాధిక గెలుపొందారు.