ఐటీ శాఖకు స్కాచ్ అవార్డు: టికి ఇండియా టుడే
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐటీ సేవల రంగంలో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. ఐటీ విస్తృతం చేయడంలో విశేష కృషిచేస్తున్న రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ (ఐటీ ఈ అండ్ సీ) శాఖను కేంద్రప్రభుత్వం స్కాచ్ అవార్డుతో సత్కరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన డిజిటల్ ఇండియాలో భాగంగా ఐటీ సేవల విస్తరణకు విశేష కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహంగా ఈ అవార్డును ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఐటీశాఖ మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో ఐటీ సేవల విస్తరణకు జరుగుతున్న విశేష కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలంగాణ ఐటీ శాఖ డైరెక్టర్ ఏఎస్ రమేష్ స్కాచ్ అవార్డును అందుకున్నారు. అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందించారు.
టికి రెండు ఇండియా టుడే అవార్డులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరాలకు ప్రతి ఏటా ఇండియా టుడే ఇచ్చే అవార్డుల్లో ఈ ఏడాది తెలంగాణకు రెండు పురస్కారాలు దక్కాయి. ఆర్థిక విభాగంలోనూ, గృహవసతిలోనూ హైదరాబాద్ నగరానికి ఈ అవార్డులు దక్కాయి. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీలో శుక్రవారం రాత్రి ప్రదానం చేసిన అవార్డులను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్కు అందించారు.
ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలో ప్రతి ఏటా వివిధ రంగాల్లో కనీసంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తున్నదని, ఆర్థికంగా దేశంలోని అన్ని నగరాల్లోకంటే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నదని తేలింది. అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. పట్టణాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్ మాట్లాడుతూ.. ఇండియా టుడే పన్నెండు విభాగాల్లో ప్రకటించిన అవార్డుల్లో రెండు విభాగాల్లో హైదరాబాద్ తొలిస్థానంలో ఉండడం సంతోషకరమని అన్నారు. హైదరాబాద్ నగరానికి రెండు అవార్డులు రావడం ద్వారా తెలంగాణ ఖ్యాతి దేశస్థాయిలో ఇనుమడించినట్లయిందని అన్నారు.