స్టీఫెన్ని ఆశీర్వదించేందుకే వెళ్లా, బాబు గ్రేట్: జగన్పై 'ఓటుకు నోటు' సెబాస్టియన్ ఫైర్
విజయవాడ: నాలుగు నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కేసులో నిందితుడు సెబాస్టియన్ మంగళవారం నాడు చెప్పారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఆహ్వానం మేరకు ఆయనను ఆశీర్వదించడానికి వెళ్లానన్నారు.
విజయవాడ కోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ వ్యవహారంలో అంతకంటే ఎక్కువగా చెప్పేది ఉండదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన సెబాస్టియన్ తనను కల్సిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొంతు ఎంతో మధురంగా ఉంటుందని, దీనికితోడు మనస్తత్వం కూడా మంచిదని, ప్రధానంగా గుంటూరులో క్రైస్తవ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే గాక క్రైస్తవుల ప్రార్థనలకు ఇజ్రాయెల్ వెళ్లేందుకు ప్రత్యేక సర్వీస్లు నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అందుకే క్రైస్తవులందరూ చంద్రబాబును ఎంతగానో అభిమానిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో కూడా క్రైస్తవులలో అత్యధిక మంది టిడిపిని బలపరచారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ క్రైస్తవుడై ఉండి మత విశ్వాసాలకు భిన్నంగా శిలువతో గోదావరి పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేయటం విచారకరమన్నారు.
జగన్ వెన్నంటి నిలిచిన క్రైస్తవులు అన్ని విధాలా మోసపోతున్నారన్నారు. చంద్రబాబు మరో మూడుసార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలరన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండేది : శ్రీనివాస్ గౌడ్
ఒకప్పుడు గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ సుభిక్షంగా ఉండేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో చెరువులను కబ్జా చేసి నాశనం చేశారన్నారు.
చెరువుల మీద ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలంగాణలో చెరువులు మాయమై వలసలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు చెరువులను నిర్లక్ష్యం చేశారన్నారు. టెండర్లు పిలిచి దోచుకుపోయారే తప్ప చెరువులను నింపాలని ఆలోచన చేయలేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చెరువులను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.