డ్రగ్స్ కేసు: సీక్రెట్ శత్రువులు పూరీని టార్గెట్ చేశారా, వారెవరు?
డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాత్ పీకల్లోతు మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. పూరీ జగన్నాథ్ కేవలం డ్రగ్స్ తీసుకున్నాడా, వాటిని సరఫరా చేశాడా అనేది ప్రధానమైన ప్రశ్న.
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాత్ పీకల్లోతు మునిగిపోయినట్లు కనిపిస్తున్నారు. తదుపరి సిట్ విచారణను ఎదుర్కుంటున్న సినీ ప్రముఖులు ఆయన సంబంధాల గురించి ఏం చెప్పారనేది కూడా ప్రధానమే అవుతుంది. శ్యాం కె నాయుడు ఇప్పటికే పూరీని పూర్తిగా ఇరికించినట్లు అనధికార వార్తాకథనాలు వస్తున్నాయి.
పూరీ జగన్నాథ్ కేవలం డ్రగ్స్ తీసుకున్నాడా, వాటిని సరఫరా చేశాడా అనేది ప్రధానమైన ప్రశ్న. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే పెద్దగా ప్రమాదం ఉండదు గానీ డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఆధారాలు దొరికితే మాత్రం ఆయన కష్టాల్లో పడక తప్పదు. ఈ విషయాన్ని ఇంకా నిర్ధారించుకోలేదని దర్యాప్తు అధికారులు అంటున్నారు.
తనను సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో మీడియా ప్రసారాలపై పూరీ జగన్నాథ్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన కొంత మంది జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాల నుంచి వైదొలిగారు కూడా. అయితే, ఆయనకు రహస్య శత్రువులు ఎవరైనా ఉన్నారా, వారు ఆయనను పూర్తిగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
నిష్పాక్షికంగానే చేస్తున్నామని....
డ్రగ్స్ కేసు విచారణను నిష్పాక్షికంగానే చేస్తామని, పని కట్టుకుని ఎవరిని కూడా ఇరికించే ప్రయత్నం చేయాల్సిన అవసరం తమకు లేదని దర్యాప్తు అధికారులు అంటున్నారు. మొత్తంగా విచారణలు పూర్తయితే తప్ప పూరీ ఏ మేరకు ఈ కేసులో ఇరుక్కుపోయానేది తేలదు.
ఆ ప్రశ్నకు ఇలా....
డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో పూరీ జగన్నాథ్ ఓ ప్రముఖ టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ కేసు మొత్తంలో మీరే టార్గెట్ కావడానికి గల కారణమేమిటి? మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు - నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని సిట్ అదికారులు కూడా ప్రశ్నించారని ఆయన చెప్పారు.
నాకు అంత తీరిక లేదు...
తనకు తెలిసినంతవరకు తానంటే ఎవరికీ కోపం లేదని పూరీ అంటూనే ‘సీక్రెట్ శత్రువులెవరైనా ఉన్నారేమో? వారే నన్ను టార్గెట్ చేశారేమో! ప్రస్తుతం నా గురించి ఆలోచించుకోవడానికే నాకు టైమ్ లేదు. ఇక, శత్రువుల గురించి ఏమి ఆలోచిస్తాను'అని చెప్పారు.
కెమెరామన్ గంగతో రాంబాబు...
తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న కాలంలో పూరీ కెమెరామన్ గంగతో రాంబాబు అనే సినిమా తీశారు. ఈ సినిమాలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొన్ని దృశ్యాలు ఉన్నాయి. కొన్ని సంభాషణలు అప్పుడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు గురిపెట్టినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఓయు విద్యార్థులు పూరీ కార్యాలయంపై దాడి కూడా చేశారు.
ఇంకా ఉంటుందా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్నాళ్లయిన తర్వాత ఇంకా పూరీ మీద ఆ కోపం ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. పైగా, అప్పట్లో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినవారిని కూడా ఇప్పుడు కెసిఆర్ ఆదరిస్తున్నారు. అందువల్ల పూరీ జగన్నాథ్కు ఇటువైపు నుంచి శత్రువులు ఉన్నారని చెప్పడానికి వీలు లేదు. నిజంగానే, పూరీకి రహస్య శత్రువులున్నారా, ఆయనే డ్రగ్స్ వ్యవహారంలో నిండా మునిగి ఉన్నాడా అనేది ఇప్పుడు తేల్చడం అవివేకమే అవుతుంది.