కెసిఆర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు: నిన్న ఏపీ కేబినెట్, నేడు టీ-టీడీపీ!
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.
అలాగే, ఫోన్ ట్యాపింగ్ పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలని శనివారం నాటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. పునర్విభజన చట్టంలో ఉమ్మడిగా పదేళ్లపాటు సేవలందించాలని పేర్కొన్న పలు సంస్థలను తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా స్వాధీనం చేసుకుందని, ఈ విషయాన్ని కూడా రాష్ట్రపతికి నివేదించాలనుకుంది.
తాజాగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు పైన ఫిర్యాదు చేయనున్నారు. తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటువేసేలా చూడాలని కోరనున్నారు.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8లు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8ల గురించి రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఫిరాయింపులపై టీటీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా, సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు జగన్ రాష్ట్రపతిని కలవనున్నారు.