తెలంగాణకు ముందు, తర్వాత కోట్లు సంపాదించిన కేసీఆర్: కవితకు ఝలక్
హైదరాబాద్: తెలంగాణ ఏర్పడక ముందు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని, తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ కుటుంబం కోట్లాది రూపాయలు సంపాదించిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు సీతక్క ఆదివారం నాడు ఆరోపించారు.
ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏపీ నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు కుటుంబం పైన ఎంపీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను ఖండించారు.
కేసీఆర్ కుటుంబం సంపాదించినంతగా ఈ అరవై ఏళ్లల్లో ఎవరూ సంపాదించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కాగా, చంద్రబాబులా తాము అడ్డగోలుగా సంపాదించలేదని రెండు రోజుల క్రితం కవిత అన్నారు. తాము ఎవరికి లెక్క చూపించాలో వారికే చూపిస్తామన్నారు. కొత్త జిల్లాలపై లోకేష్ వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. లోకేష్ మొదట్నుంచీ తెలంగాణ వ్యతిరేకేనని ఆమె ఆరోపించారు. కవిత వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెరాస ప్రభుత్వంపై చాడ ఆగ్రహం
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్లో రోడ్ల అవినీతిపై సిఐడితో విచారణ జరిపించాలని, రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకోవడం దారుణమని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలన అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.
అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. సచివాలయం మార్పుకు ఖర్చు చేసే నిధులను సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేశారు. నవంబర్లో వరంగల్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని చెప్పారు.