వాళ్లు రూ.150 కోట్లడిగిన మొక్క.. తెలంగాణలో బయటపడింది
మహబూబ్ నగర్ : సంజీవని మొక్క ఆనవాళ్లను కనుగొనేందుకు గాను ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రాన్ని రూ.150 కోట్ల ఇవ్వాలని కోరడం ఇటీవల అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. సైన్స్ భాషలో సెలగినెల్లా బ్రైయాప్టెరిస్ గా పరిగణించే అరుదైన ఆ సంజీవని మొక్క మనిషి ప్రాణాలను నిలబెట్టగలదా..? లేదా..? అన్న విషయాన్ని పక్కనబెడితే తెలంగాణలోను ఆ మొక్క ఆనవాళ్లు ఉన్నట్టు తేలడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి డిగ్రీ కళాశాలకు చెందిన వృక్షశాస్త్ర అధ్యాపకుడు సదాశివయ్య మండలంలోని తిరుమలయ్య గుట్టపై సంజీవని మొక్కలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే నాలుగేళ్ల క్రితమే సంజీవని మొక్క ఆనవాళ్లను గుర్తించిన సదాశివయ్య అప్పటి ప్రభుత్వాల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లగా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.
విద్యార్థులతో కలిసి ఆయన చేసిన పరిశోధనల్లో భాగంగా తిరుమలయ్య గుట్టపై సంజీవని మొక్కల ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించారు. జిల్లాలో అనేక ఔషధ మొక్కలకు కొదువ లేదని చెబుతున్న సదాశివయ్య, ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. తమ పరిశోధనలకు మరింత పదును పెడుతానని అంటున్నారు. అలాగే అడవుల పరిశోధన నిమిత్తం నిపుణులకు అనుమతివ్వాలని కోరిన ఆయన, అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.
ఇదిలా ఉంటే.. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. తరాలుగా వారసత్వంగా కొనసాగుతూ వస్తోన్న భారతీయ ఔషధ వైద్య పద్దతులకు మరింత మెరుగులు అద్దేందుకు, కనుమరుగైపోతున్న ఔషధ జాతులను పరిరక్షించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
కాగా, ఈ ఏడాది ఆయుష్ మంత్రిత్వ శాఖకు కేంద్రం రూ.1326 కోట్లను విడుదల చేసింది. భారత్ లో 8000 ఔషధ మొక్కలు ఉండగా ప్రస్తుతం వైద్య విధానంలో అందుబాటులో ఉన్నవి కేవలం 500 మొక్కలేనని పేర్కొంది ఆయుష్ మంత్రిత్వ శాఖ. దీంతో ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు సంజీవని లాంటి ఔషధ మొక్కలను కనుగొనడానికి పెద్ద మొత్తంలో నిధులను కోరుతున్నాయి.
సంజీవనితో పోయిన ప్రాణం తిరిగొస్తుందా..?
పునరుజ్జీవనం సాధ్యం కాకపోయినప్పటికీ, శరీరంలోని అన్ని అవయవాల పనితీరు సక్రమంగానే ఉన్నా మనిషి కోమాలోకి వెళ్లే కొన్ని అరుదైన సందర్భాల్లో సంజీవని మొక్క ద్వారా ఫలితాలు రాబట్టవచ్చునంటున్నారు బెంగుళూరుకు చెందిన పరిశోధకులు.