సోనియాతో తెలంగాణ, బురదజల్లను: డీఎస్, ఆ ముగ్గురి ఫోటో తీసేశారు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని వీడటం బాధాకరమని, కేసీఆర్కు అండగా రాజకీయపునరేకీకరణ జరగాలని, ఎమ్మెల్సీ పదవి తనకు ఓ లెక్క కాదని డీ శ్రీనివాస్ గురువారం నాడు అన్నారు. తనకు సోనియా గాంధీ ఎప్పటికీ ఆరాధ్యురాలే అన్నారు. దిగ్విజయ్ సింగ్ వంచకుడు అని మండిపడ్డారు.
అంతరాత్మ ప్రభోదానుసారం తాను టీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయే అన్నారు. అలాగే ఉద్యమాన్ని నడిపిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. దిగ్విజయ్ సింగ్ పెద్ద బుకాయింపుదారు అన్నారు.
డీఎస్ పార్టీని వీడటంపై సీనియర్ నేతలు మండిపడ్డారు. ఇన్నాళ్లు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం సరికాదన్నారు. డీఎస్ పదవి లేకుండా కనీసం 30 రోజులు ఉండలేకపోయారన్నారు. కాగా, పార్టీకి అధ్యక్షులుగా పని చేసిన కేకే, బొత్స సత్యనారాయణ, డీ శ్రీనివాస్లు ఇతర పార్టీల్లో చేరారు.
దీంతో గాంధీ భవన్లో వారి ఫోటోలను తీసివేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కేకే ఎప్పుడో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. డీఎస్ కారు ఎక్కేందుకు సిద్ధమయ్యారు. బొత్స సత్యనారాయణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షులుగా పని చేసిన వారి ఫోటోల లిస్ట్లో వారి ఫోటోలు తీసివేయనున్నారు.
డీ శ్రీనివాస్
ఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్పై పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత డీ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. దిగ్విజయ్ ఒక బ్లఫర్ (మోసగాడు, వంచకుడు), చెప్పుడు మాటలు వినేరకం అని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆకుల లలితను తనకు చెప్పిన తరువాతే ఎంపిక చేశానన్న దిగ్విజయ్ ప్రకటన అవాస్తవమని స్పష్టం చేశారు.
డీ శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేసిన విషయాన్ని, భవిష్యత్తు కార్యాచరణ గురించి గురువారం ఆయన మీడియాకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపించిన రాజీనామా లేఖను ఈ సందర్భంగా విడుదల చేశారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్కు రాజీనామా చేయాల్సి వచ్చినందుకు ఎంతో బాధగా ఉందని, ఇది తన జీవితంలో ఎంతో బాధాకరమైన రోజు అన్నారు.
డీ శ్రీనివాస్
సోనియా గాంధీ తనకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేనని, జీవితాంతం ఆమెకు రుణపడి ఉంటానని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్లో తనపై కామెంట్ చేసే మొనగాడు ఎవరూ లేరని, తన కమిట్మెంట్, పార్టీ పట్ల తను ప్రదర్శించిన లాయల్టీ కలిగిన నేత కాంగ్రెస్లో మరెవరూలేరన్నారు. అలాగే వెళ్తూ వెళ్తూ పార్టీ మీద బురద చల్లాలనే కోరిక కూడా తనకు లేదని చెప్పారు.
డీ శ్రీనివాస్
తెలంగాణ సాధనకు పార్టీలో ఉండి తాను చేసిన కృషికి ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ఉద్యమాన్ని చివరిదాకా కొనసాగించి నాయకత్వం వహించిన ఘనత కచ్చితంగా కేసీఆర్కు దక్కుతుందన్నారు. నా అంతరాత్మ చెప్పింది.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఎంపవర్మెంట్కు కృషి చేయడమే ఈ వయసులో నా కర్తవ్యంగా భావించి టీఆర్ఎస్లో చేరుతున్నా అన్నారు.